ముంబై: ప్రధాని నరేంద్ర మోదీపై వివాదస్పద బీబీసీ డాక్యుమెంటరీ విద్యా సంస్థలను కుదిపేస్తున్నది. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో శనివారం రాత్రి 7 గంటలకు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు విద్యార్థులు ప్లాన్ చేశారు. దీని కోసం ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫోరమ్ (పీఎస్ఎఫ్) అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు విద్యార్థులను సమీకరించింది. నిషేధానికి వ్యతిరేకంగా, ఇతర విద్యా సంస్థలకు మద్దతుగా షెడ్యూల్ ప్రకారం బీబీసీ సీరీస్ను స్క్రీనింగ్ చేస్తామని విద్యార్థులు తెలిపారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించవద్దని టిస్ యాజమాన్యం నోటీస్ జారీ చేసింది. దీనిని ఉల్లంఘించి శాంతి భద్రతలు, సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగం కావడంతో యువ మోర్చా కార్యకర్తలు, అనుబంధ విద్యార్థి సంఘం సభ్యులు టిస్ వద్ద నిరసనకు దిగారు. ప్రధాని మోదీకి సంబంధించిన వివాదస్పద బీబీసీ సీరిస్ను ప్రదర్శించవద్దని నినాదాలు చేశారు. దీంతో టిస్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది.