న్యూఢిల్లీ: స్థానిక పరిస్థితుల మేరకు దశలవారీగా స్కూళ్లను తెరువవచ్చని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఈ దిశగా దేశం ఆలోచించాలని ఆయన సూచించారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో పిల్లలు చదువును కోల్పోతుండటంపై గులేరియా ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ కాలం స్కూళ్ల మూసివేత పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. మరోవైపు డిజిటల్ సౌకర్యాలు లేని ఎందరో పిల్లలు ఆన్లైన్ విద్యను పొందలేకపోతున్నారని చెప్పారు. పిల్లల సాధారణ జీవితాన్ని మాత్రమేగాక వారి సమగ్ర అభివృద్ధిలో పాఠశాల విద్య ప్రాముఖ్యతను కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.
ఈ నేపథ్యంలో కరోనా కేసులు తక్కువగా ఉన్న జిల్లాల్లో స్థానిక పరిస్థితుల మేరకు స్కూళ్లను తెరువవచ్చని డాక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. కరోనా పాజిటివ్ రేటు ఐదు శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో స్కూలు తెరువడంపై ప్లాన్ చేయవచ్చని చెప్పారు. కరోనా వ్యాప్తి పెరిగితే స్కూళ్లను మూసివేయడం లేదా విద్యార్థులను రోజు విడిచి రోజు స్కూళ్లకు రప్పించడం వంటి పద్ధతులను పాటించవచ్చని తెలిపారు. స్కూళ్లలో వెంటిలేషన్, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటికి తప్పక పాటించేలా చూడాలన్నారు.
పిల్లలు వైరస్ బారిన పడటం మంచిదేనని, దీని వల్ల చాలా మంది పిల్లల్లో సహజ రోగనిరోధక శక్తి పెరిగిందని డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఎయిమ్స్, డబ్ల్యూహెచ్వో చేసిన సర్వేలో వయోజన జనాభాతో పోల్చితే పిల్లలలో SARS-CoV-2 సెరో-పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కరోనా వేరియంట్ లేదా మూడవ వేవ్ రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలను అంతగా ప్రభావితం చేసే అవకాశం లేదని చెప్పారు. పిల్లల వ్యాక్సిన్ ప్రయోగాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. దేశంలో సెప్టెంబర్ నాటికి పిల్లల టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నదని గులేరియా అంచనా వేశారు.