గడ్చిరోలి: కాన్ఫ్లిక్ట్ టైగర్.. సీటీ-1 పులిని మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో ఆ పులి ఇప్పటివరకు సుమారు 13 మందిని చంపింది. మత్తు మందు ఇచ్చి.. గురువారం ఉదయం దాన్ని బంధించినట్లు అధికారులు వెల్లడించారు. గడ్చిరోలిలోని వాద్సా ఫారెస్ట్ రేంజ్లో ఆ పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. దాని వల్ల మనుషులకు ప్రమాదం ఉందని ఇటీవల అటవీశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.
వాద్సాలో ఆరు మందిని, భాంద్రాలో నలుగుర్ని, బ్రహ్మపురి ఫారెస్ట్ రేంజ్లో ముగ్గుర్ని ఆ పులి హతమార్చినట్లు నాగపూర్లోని వన్యప్రాణి సంరక్షణాధికారి తెలిపారు. ఆయన ఆదేశాల మేరుకు ఆ పులిని బంధించారు. తడోబా టైగర్ రెస్క్యూ టీమ్, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఆఫ్ చంద్రపూర్ తో పాటు ఇతర యూనిట్లు కూడా యుద్ధ ప్రాతిపదికన పులిని పట్టుకున్నట్లు అధికారి తెలిపారు.
ఆ పులిని నాగపూర్లోని గోరేవాడ రెస్క్యూ సెంటర్కు తరలించారు.