BJP | భోపాల్, నవంబర్ 13: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నది. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇందులో భాగంగా 75 ఏండ్లు దాటిన వారిని ఎన్నికల రాజకీయాల పక్కకు పెట్టాలనే విధానం తీసుకొన్నామని చెప్పే కమలం పార్టీ.. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేందుకు అదే సీనియైర్లెన వృద్ధ నేతలపై ఆధారపడుతున్నది. జగదీశ్ శెట్టర్, కేఎస్ ఈశ్వరప్ప వంటి పలువురు సీనియర్లకు టికెట్ నిరాకరించడంలో ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యప్రదేశ్లో ‘75 ఏండ్ల’ రూల్ను బ్రేక్ చేసింది. 70 ఏండ్లు పైబడిన 14 మంది నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. అందులో ఒక అభ్యర్థి వయసైతే 80 ఏండ్లు.
సత్నా జిల్లా నాగోడ్ స్థానం నుంచి రాష్ట్ర మాజీ మంత్రి నాగేంద్ సింగ్ నాగోడ్(80)ని బీజేపీ బరిలోకి దింపింది. రేవా జిల్లా గూఢ్ నుంచి నాగేంద్ర సింగ్(79)ని పోటీచేయిస్తున్నది. గూఢ్లో పోటీ ఆసక్తికరంగా ఉన్నది. 79 ఏండ్ల నాగేంద్రసింగ్తో 25 ఏండ్ల ఆప్ అభ్యర్థి ప్రతాప్సింగ్ తలపడుతున్నారు. వాస్తవానికి నాగేంద్రసింగ్ నాగోడ్, నాగేంద్రసింగ్ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోమని ఐదు నెలల కిందటే ప్రకటించారు. అయినప్పటికీ వారిని బీజేపీ అధిష్టానం బరిలోకి దించింది. బీజేపీ నుంచి పోటీచేస్తున్న సీనియర్ నాయకుల్లో జయంత్ మలైయా(76), జగన్నాథ్ సింగ్(75), సీతాశరణ్ శర్మ(73), బిషాహులాల్ సింగ్(73), మాయా సింగ్(73), హిజారిలాల్ దంగి(72) తదితరులు ఉన్నారు. 2016లో సర్తాజ్ సింగ్ను(అప్పుడు 76 ఏండ్లు) వయసు పేరుతో శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్ నుంచి తప్పించారు. ఆయనకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ నిరాకరించారు.
కాంగ్రెస్ కూడా 70 ఏండ్లు పైబడిన తొమ్మిది మంది నేతలకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చింది. వీరిలో అత్యధిక వయస్కుడు 77 ఏండ్ల నరేంద్ర నహతను నీముచ్ జిల్లా మనస నియోజకవర్గం నుంచి బరిలో దింపింది. ఈ లిస్టులో మాజీ సీఎం కమల్నాథ్ కూడా ఉన్నారు. 76 ఏండ్ల కమల్నాథ్ చింధ్వారా నుంచి పోటీచేస్తున్నారు.
మధ్యప్రదేశ్లో 75 ఏండ్ల దాటిన సీనియర్లకు కూడా టికెట్లు ఇవ్వడం పార్టీ నేతలను ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా గత లోక్సభ ఎన్నికలకు ముందు అమిత్షా చేసిన ప్రకటనను గుర్తుచేసుకొంటున్నారు. 75 ఏండ్లు దాటిన వారికి టికెట్టు ఇవ్వకూడదని పార్టీ నిర్ణయం తీసుకొన్నదని 2019, ఏప్రిల్లో అప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్షా ప్రకటించారు. దీని కారణంగా బీజేపీలో సీనియర్ నేతలైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు.