Rave Party | బెంగళూరులోని జీఆర్ ఫామ్హౌస్లో జరిగిన రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా హెబ్బగోడి పీఎస్కు చెందిన ముగ్గురు పోలీసులపై వేటు పడింది. ఏఎస్సై నారాయణ స్వామి, కానిస్టేబుళ్లు గిరీశ్, దేవరాజును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రేవ్ పార్టీ గురించి తెలిసినప్పటికీ.. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ వారిని సస్పెండ్ చేశారు. అనేకల్ ఏఎస్పీ మోహన్ కుమార్, ఇన్స్పెక్టర్ అయ్యన్న యాదవ్లకు నోటీసులు జారీ చేశారు. మరో ఇద్దరు పోలీసులకు మెమోలు జారీ చేశారు.
కాగా, బెంగళూరు రేవ్ పార్టీ ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరుతో నిర్వహించిన ఈ పార్టీకి 150 మంది హాజరవ్వగా.. వీరిలో 105 మంది మాత్రమే పట్టుబడ్డారు. మిగిలివారు తప్పించుకున్నారు. ఈ కేసులో 14.40 గ్రాముల ఎండీఎంఏఈ పిల్స్, 1.16 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్, 5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పట్టుబడిన వారికి పరీక్షలు నిర్వహించగా.. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా వెల్లడైంది. వీరిలో 59 మంది పురుషులు ఉండగా.. 27 మంది మహిళలు ఉన్నారు. ఈ కేసులో ఏ1గా వాసు, ఏ2గా అరుణ్కుమార్, ఏ3గా నాగబాబు, ఏ4గా రణ్ధీర్ బాబు, ఏ5గా మహమ్మద్ అబూబాకర్, ఏ6గా గోపాల్రెడ్డి పేర్లను నమోదు చేశారు. ఇక టాలీవుడ్కు చెందిన హేమ, ఆషీరాయ్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది.