ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఇవాళ ఉదయం ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనను మరువకముందే అదే రాష్ట్రంలోని సోలాపూర్ జిల్లాలో ఈ సాయంత్రం మరో దుర్ఘటన చోటుచేసుకుంది.
సోలాపూర్ జిల్లాలోని షిరాలే గ్రామంలోగల పటాకుల తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆ కర్మాగారంలో పనిచేసే ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.