థానే: మహారాష్ట్రలోని థానే జిల్లా కల్వ పట్టణంలో గల ఛత్రపతి శివాజీ మహరాజ్ (CSM) ఆస్పత్రిలో రోగుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రానికి కేవలం 24 గంటల వ్యవధిలోనే 18 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత మరో ముగ్గురు రోగులు మరణించారు. దాంతో ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 21కి చేరింది.
దాంతో ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితి విషమంగాలేని రోగులను సమీపంలోని సివిక్ ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ కాని సమస్యలతో ఆస్పత్రిలో చేరేందుకు వచ్చిన వారిని కూడా సివిక్ ఆస్పత్రికి పంపిస్తున్నారు. కాగా, వరుస మరణాల నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే CSM ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. సదుపాయాల మెరుగు కోసం రూ.71 కోట్ల నిధులను కేటాయించారు.