జైపూర్: రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించనున్నది. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ జరగనున్నది. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులు ముందుగానే రాజీనామా చేశారు.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖలను సమర్పించారు. రెవన్యూశాఖ మంత్రి హరీశ్ చౌదరీ, వైద్యశాఖ మంత్రి రఘు శర్మ, విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోస్తారాలు రాజీనామా లేఖలు పంపినవారిలో ఉన్నారు. అయితే ఆ ముగ్గురూ పార్టీతో పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దోస్తారా కొనసాగుతున్నారు. గుజరాత్ ఇంచార్జీగా శర్మ, పంజాబ్ ఇంచార్జీగా హరిశ్ చౌదరీలు ఉన్నారు. రాజస్థాన్లో 21 మంది మంత్రులు ఉన్నారు. 200 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ రాష్ట్రంలో అత్యధికంగా 30 మంత్రులు ఉండే అవకాశం ఉన్నది.