న్యూఢిల్లీ, మే 24: క్రికెటర్ శుభ్మన్ గిల్ సోదరిని సామాజిక మాధ్యమాల్లో దూషించడమే కాక ఆమెపై లైంగిక దాడి చేస్తామంటూ బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్ బుధవారం పోలీసులను ఆదేశించింది. ఐపీఎల్లో ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న శుభ్మన్ గిల్ సెంచరీ చేసి జట్టు గెలుపులో ప్రధాన పాత్ర పోషించడమే కాక, ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్కు చేరకుండా అడ్డుకున్నాడు.
దీంతో ఆట పూర్తయిన తర్వాత తన సోదరుడిని అభినందిస్తూ గిల్ సోదరి పోస్టింగ్లు పెట్టింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల అభిమానుల మధ్య సామాజిక మాధ్యమం వేదికగా వార్ మొదలైంది. ఆర్సీబీ అభిమానులుగా భావించే కొందరు శుభ్మన్ గిల్ సోదరిని సామాజిక మాధ్యమాల్లో దారుణంగా ట్రోలింగ్ చేశారు. కొందరైతే ఆమెను రేప్ చేస్తామంటూ బెదిరించారు. దీనిపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ వెంటనే కేసు నమోదు చేయాలని, ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను ఈనెల 26లోగా సమర్పించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.