ఢిల్లీ: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ చీఫ్ పదవి నుంచి తాను దిగిపోతున్నట్లు, కుమారుడు తేజస్వి పార్టీ అధ్యక్షుడు అవుతారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అలా అంటున్న వారు, అలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వారు మూర్ఖులని విమర్శించారు. పార్టీలో ఏమి జరిగినా సమాచారం ఇస్తామని చెప్పారు.
పశు దానా కుంభకోణం కేసులో జైలు శిక్ష పడిన లాలూ ప్రసాద్ యాదవ్, అనారోగ్య కారణాలతో గత ఏడాది చివరిలో బెయిల్పై విడుదలయ్యారు. నాటి నుంచి ఆయన ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు. దీంతో బీహార్లోని ఆర్జేడీ వ్యవహారాలన్నీ ఆయన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ ప్రధానంగా చూస్తున్నారు. ఇటీవల పెండ్లి అయిన తేజస్వికి పార్టీ పగ్గాలను అప్పగిస్తారని, అధ్యక్ష పదవిని ఆయన చేపడతారంటూ ఊహాగానాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో దీనిపై స్పందించాలని ఢిల్లీలోని లాలూ ప్రసాద్ యాదవ్ను మీడియా కోరింది. తేజస్వి యాదవ్ను జాతీయ అధ్యక్షుడిగా చేస్తారా అని రిపోర్టర్లు అడిగారు. దీనికి ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. అలాంటి వార్తలను ప్రచారం చేస్తున్న వారు మూర్ఖులని విమర్శించారు. పార్టీలో ఏమి జరిగినా సమాచారం ఇస్తామని మీడియాతో అన్నారు.
మరోవైపు, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఈ ప్రచారాన్ని ఖండించారు. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీని బాగా నడుపుతున్నారని, అధ్యక్షుడిగా ఆయనే ఉంటారని అన్నారు. ఈ నెల 10న పాట్నాలో జరిగే ఆర్జేడీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తులు పాల్గొంటారని తెలిపారు. కాగా, మాజీ సీఎం రబ్రీ దేవి, తేజస్వి యాదవ్తో సహా ఇతర నేతలు హాజరయ్యే ఈ సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పాల్గొనవచ్చని తెలుస్తున్నది.
#WATCH | Delhi: "Those who run such news reports are fools. We will get to know whatever happens," says RJD chief Lalu Prasad Yadav when asked if Tejashwi Yadav will be made the national president of the party. (04.02.2022) pic.twitter.com/NYC5YiLzVm
— ANI (@ANI) February 5, 2022