Shashi Tharoor: వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ‘INDIA’ కూటమిలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే విభేదాలు మొదలయ్యాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జి, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్, బీహార్ సీఎం నితీశ్కుమార్ కూటమి పార్టీలతో సీట్ షేరింగ్పై కొర్రీలు పెడుతున్నారు. తామే అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామని పంతానికి పోతున్నారు.
దాంతో ఐక్యత లేని కూటమి అధికార బీజేపీని ఓడించడం కల్ల అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ INDIA కూటమిపై స్పందించారు. కూటమిలోని పార్టీల మధ్య సీట్ల షేరింగ్ అనేది రాష్ట్రాల వారీగా జరుగుతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయం అన్ని రాష్ట్రాల్లో పొసగదని అన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా సీట్ల సర్దుబాటు జరుగుతుందని తెలిపారు.
అయితే కేంద్రంలో సర్కారును మార్చడంపైనే ఈ ప్రతిపక్ష కూటమి నేతలంతా ప్రధానంగా దృష్టిసారిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. అది తిరుగులేని లక్ష్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రతిపక్షాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయని తెలిపారు.