చండీగఢ్ : శ్రీరాముడిపై బీహార్ హామీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ చేసిన వ్యాఖ్యలపై హర్యానా మంత్రి అనిల్ విజ్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యక్తి భూమికి భారం అంటూ మండిపడ్డారు. శ్రీరాముడు ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడని, దేశంలో హిందువులకు మెజారిటీ ఉందని.. వారికి రాముడిపై నమ్మకం ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా మాట్లాడడం బాధ్యారాహిత్యమన్నారు. ఇటీవల సిక్రిందాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీరాముడు, రామాయణంపై మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు దేవుడు కాదని, తులసీదాస్, వాల్మీకి రాసిన రామాయణంలో కేవలం ఒక పాత్ర మాత్రమేనన్నారు.
రామాయణం కేవలం కథ మాత్రమేనని.. నిజమైన సంఘటన కాదన్నారు. రామాయణంలో రాసిన వాటిని అనుసరించడం తప్పేం కాదని.. కానీ శ్రీరాముడిని నమ్మరన్నారు. అయితే, మాంఝీ వ్యాఖ్యలపై ఆయన పేరు పెట్టకుండానే బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడన్నారు. వాల్మీకి మహర్షి రామాయణం రూపంలో ఎవరి చరిత్ర రాశారో.. రామసేతువుతో పాటు చెరగని సాక్షాలు అందుబాటులో ఉన్నాయని.. పొంతలేని ప్రకటనలు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు.