‘ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అయితే, వాటిని నిజం చేసుకునేందుకు గట్టి కృషి చేయాలి..’ ఇలాంటి సూక్తులు మనం నిత్యం వింటూ ఉంటాం. లండన్లో నివసించే ఈయన మాత్రం అలా కలలు కని వాటిని నిజం చేసి చూపాడు. అలాగని ఏదో ఆషామాషీ కల కాదు సుమా..! తానే సొంతంగా విమానం తయారు చేసుకుని దానిలో తన భార్యాకుమార్తెలను యూరప్ ట్రిప్కు తీసుకెళ్లడం అనే టార్గెట్ పెట్టుకుని మరీ కష్టించి కల సాకారం చేసుకున్నాడు. ఆయనే భారతదేశం మూలాలున్న అశోక్ అలిసేరిల్ థామరక్షణ్.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచదేశాల్లోని ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. కొందరు వంటలు చేస్తూ కాలక్షేపం చేయగా.. మరికొందరు తమకు ఇష్టమైన కోర్సులను పూర్తిచేసుకుని కొత్త అవతారం ఎత్తేందుకు సిద్ధమయ్యారు. ఇంకొందరు ఆఫీసు పనులతో 24 గంటలు కుస్తీపడుతూ గడిపారు. అయితే, కేరళకు చెందిన అశోక్ అలిసేరిల్ థామరక్షణ్ మాత్రం అలా ఎలాగో టైమ్పాస్ చేయాలని అనుకోలేదు. తన మెదడులో ఎన్నో ఏండ్లుగా గూడు కట్టుకున్న కోరికను నిద్రలేపాడు. నిరంతరాయంగా దాదాపు 18 నెలలపాటు మొత్తంగా 1500 గంటలు కష్టించాడు. రూ.14 లక్షలకు పైగా ఖర్చుపెట్టాడు. చివరకు ‘దివ్య’ అనే పేరుతో దివ్యమైన సింగిల్ ఇంజిన్తో నాలుగు సీట్ల విమానాన్ని సిద్ధం చేశాడు.
ఇంకేం! మెకానికల్ ఇంజినీర్గా పనిచేస్తున్న తన భార్య, ఇద్దరు కుమార్తెలను వెంటేసుకుని యూరప్ యాత్రకు బయల్దేరాడు. తన యూకే-యూరప్ యాత్రలో భాగంగా అశోక్ అలిసేరిల్.. జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్లలో పర్యటించాడు. ఈ విమానానికి తన పెద్ద కూతురు పేరు ‘దివ్య’ అని పెట్టుకున్నాడు. ‘ఈ కొత్త గాడ్జెట్ని పొందడం కంటే సంతోషకరమైంది మరోటి లేదు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తొలిసారి షట్డౌన్ సమయంలో డబ్బు ఆదా చేయడం మొదలెట్టాం. ఎందుకంటే ఈ మొత్తంతో సొంత విమానాన్ని తయారుచేయాలని కలలు కన్నాను. చాలా డబ్బు ఆదా చేయడంతో విమానం తయారీకి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నా’ అని అశోక్ అలిసేరిల్ తెలిపారు. 2018 లో పైలట్ లైసెన్స్ పొందగానే మొదట్లో విహారయాత్రల కోసం నిరాడంబరమైన టూ-సీటర్ ఎయిర్క్రాఫ్ట్లను అద్దెకు తీసుకునేవాడినని చెప్పారు. కుటుంబం పెరుగడంతో టూ-సీటర్ కాస్తా ఫోర్-సీటర్గా మారడంతో ఖర్చు పెరిగిపోయిందన్నారు. దాంతో తమ కుటుంబం కోసం సొంతంగా విమానం ఉండాలని గ్రహించి స్వయంగా తయారీకి ఉపక్రమించినట్లు చెప్పుకొచ్చారాయన.
కేరళలోని అలప్పుజకు చెందిన అశోక్ అలిసేరి థామరక్షణ్.. పాలక్కాడ్ యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం 2006 లో బ్రిటన్ వెళ్లారు. ఈయన తండ్రి ఏవీ థామరక్షణ్ ప్రస్తుత కేరళలో ఎమ్మెల్యేగా ఉన్నారు.