మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం, సూత్రం అంటే తాడు, ఆధారమని అని అర్థం. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముళ్ళను వేయిస్తారు వేదపండితులు. అలా వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది.
కానీ 21వ శతాబ్దంలో మాత్రం ఓ వరుడు.. వధువు చేత తన మెడలో మంగళసూత్రం కట్టించుకుని వార్తల్లో నిలిచాడు. తాను హార్డ్కోర్ ఫెమినిస్ట్(స్ర్తీ వాది)ను అని స్ర్తీ, పురుషులందరూ సమానమేనని ఆ వరుడు చెప్పుకొచ్చాడు. ఈ వివాహంపై సామాజిక మాధ్యమాల్లో భిన్న రకాలుగా విమర్శలు వస్తున్నాయి.
ముంబైకి చెందిన శార్దూల్ కదం, తనుజా మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఒకే కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆ తర్వాత మళ్లీ నాలుగు సంవత్సరాలకు ఇన్స్టాగ్రామ్ వేదికగా కలుసుకున్నారు. తనుజా తన ఇన్స్టా పేజీలో హిమేష్ రేష్మియా సాంగ్ను పోస్టూ చేస్తే టార్చర్ అని ట్యాగ్ చేసింది. దీనిపై శార్దూల్ స్పందిస్తూ మహా టార్చర్ అని ట్యాగ్ చేశాడు. అలా వారిద్దరి మధ్య మంచి సంభాషణ కొనసాగింది.
ఈ సంభాషణ జరిగిన కొద్ది వారాలకు చాయ్ తాగుదాం.. కలుద్దాం అని తనుజా శార్దూల్ను కోరింది. ఆమె కోరిక మేరకు శార్దూల్ కలిసి చాయ్ తాగారు. ఆ సందర్భంగా మూవీస్, భవిష్యత్ ప్రణాళికలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఫెమినిజమ్ గురించి చర్చ వచ్చింది. తాను హార్డ్కోర్ ఫెమినిస్ట్(స్ర్తీ వాది)ను అని శార్దూల్ చెప్పాడు. ఆమె శార్దూల్ వైపు ఒక రకంగా చూసింది. తాను ఫెమినిస్టును అని తనుజా ఊహించలేకపోయింది అని శార్దూల్ అన్నాడు.
ఇక నెల రోజుల తర్వాత మళ్లీ కలుసుకున్నారు తనుజా, శార్దూల్. ఆ రోజు శార్దూల్ బర్త్డే. శార్దూల్కు తనుజా చేతితో తయారు చేసిన కార్డును గిఫ్ట్గా ఇచ్చింది. అప్పటికే తాను ఆమెను ఇష్టపడుతున్నట్లు తెలుసు. దీంతో తాను నిన్ను ఇష్టపడుతున్నానని తనుజాకు చెప్పాడు శార్దూల్. రెండు రోజుల తర్వాత తనుజా కూడా శార్దూల్ను ఇష్టపడుతున్నట్లు అతని ఫోన్కు మేసేజ్ చేసింది. అలా వారిద్దరి మధ్య బంధం మరింత దగ్గరైంది. డేటింగ్ చేశారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు.
ఏడాది కాలం పాటు తనుజా, శార్దూల్ డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత తమ పెళ్లి గురించి తల్లిదండ్రుల వద్ద ప్రస్తావన తెచ్చారు. 2020, సెప్టెంబర్లో పెళ్లికి పెద్దలు నిశ్చయించారు. కానీ కరోనా కారణంగా ఆ పెళ్లి వాయిదా పడింది. ఈ క్రమంలో మళ్లీ వారిద్దరి మధ్య పెళ్లి ఎలా చేసుకోవాలి అనే అంశంపై చర్చ వచ్చింది.
పెళ్లి రోజున మహిళలే ఎందుకు మంగళసూత్రం ధరించాలి? అని తనుజాను శార్దూల్ ప్రశ్నించాడు. స్ర్తీలు, పురుషులు సమానమే కదా.. మన పెళ్లి రోజున తాను కూడా మంగళసూత్రం ధరిస్తానని శార్దూల్ తనుజాకు చెప్పాడు. ఈ విషయం తెలుసుకుని వారి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకిలా చేస్తున్నావ్ అని బంధువులు శార్దూల్ను ప్రశ్నించారు. పెళ్లి అనేది రెండు మనసుల కలయిక. అలాంటప్పుడు పురుషుడు మంగళసూత్రం ధరిస్తే తప్పేంటని బంధువులను శార్దూల్ ప్రశ్నించాడు.
తనుజా తల్లిదండ్రులకు పెళ్లి చేసేందుకు డబ్బు సమస్య వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శార్దూల్ తనుజా కుటుంబానికి అభయమిచ్చాడు. పెళ్లి ఖర్చు కూడా సమానంగా పంచుకుందామని, మీరు ఒక్కరే భరించాల్సిన అవసరం లేదని వారికి చెప్పాడు శార్దూల్.
ముహూర్తం రోజున మాత్రమే మంగళసూత్రం ధరిస్తారా? అని పెళ్లికి ముందు రోజు తనుజా శార్దూల్ ను ప్రశ్నించింది. ఆ ఒక్కరోజే కాదు.. ప్రతి రోజు మంగళసూత్రం ధరిస్తానని శార్దూల్ స్పష్టం చేశాడు. మొత్తానికి నాలుగు నెలల క్రితం తనుజా, శార్దూల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శార్దూల్ మంగళసూత్రం ధరించడం బంధువులకు ఇష్టం లేకపోయినప్పటికీ, వాళ్ల కోసం కాదు తాను జీవించేది. తన విలువలు, హక్కుల కోసం తాను జీవిస్తున్నానని శార్దూల్ చెప్పాడు. అందుకే మంగళసూత్రం ధరిస్తున్నానని చెప్పాడు.
పెళ్లైన మరుసటి రోజే తనుజా షాక్కు గురైంది. ఎందుకంటే వీరి వివాహం గురించి ఓ డిజిటల్ న్యూస్ పేపర్ ప్రచురించింది. ఇక నెటిజన్లు వారి వివాహంపై ఇష్టమొచ్చినట్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు చీర కూడా ధరించండి అంటూ శార్దూల్ను ఉద్దేశించి విమర్శించారు. ప్రతి నెల మీరు రుతుస్రావం అవుతున్నారా? అని వ్యంగంగా ప్రశ్నించారు. కానీ ఆ ట్రోల్స్ను ఆ నూతన దంపతులు పట్టించుకోలేదు. తామిద్దరం ఏంతో తమకు తెలుసు. కాబట్టి ప్రపంచం ఏం అనుకుంటే తమకెందుకు అని శార్దూల్, తనుజా చెప్పారు.
ఇవి కూడా చదవండి..