ఫరీదాబాద్, అక్టోబర్ 14: సమయం ఎంతో విలువైంది.. జీవితంలో ఒక్కరోజు గడిచిపోతే మళ్లీ తిరిగిరాదు.. ఇది గుర్తించిన బీహార్కు చెందిన ఓ విద్యార్థిని తన కలను సాకారం చేసుకొనే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. బీహార్ వాసి వార్తికా సింగ్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి హర్యానాలోని ఫరీదాబాద్కు వచ్చింది. ఎప్పటికైనా సొంతంగా వ్యాపారం చేయాలన్నది ఆమె లక్ష్యం. అయితే ఇంజినీరింగ్ పూర్తవ్వడానికి నాలుగేండ్లు పడుతుందని, అప్పటి వరకు సమయాన్ని వృథా ఎందుకు చేయాలని అనుకున్న ఆమె.. వెంటనే ఓ టీ స్టాల్ను పెట్టింది. ఉదయం కాలేజీకి వెళ్లడం, సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు చాయ్ అమ్మడాన్ని దినచర్యగా పెట్టుకున్నది. ఫరీదాబాద్లోని గ్రీన్ ఫీల్డ్ వద్ద ‘బీటెక్ చాయ్వాలీ’ అనే పేరుతో ఏర్పాటు చేసిన టీ స్టాల్ పలువురిని ఆకర్షిస్తున్నది. ఇక్కడ ఓ బ్యానర్ను కూడా ఏర్పాటు చేసింది ఆమె. ‘ఆత్మ విశ్వాసం, కృషి ఎప్పుడూ విజయాన్ని ఇస్తాయి’ అని ఆ బ్యానర్పై ఉన్నది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నది.