రాయ్పూర్: మే 1 నుంచి ప్రారంభం కానున్న మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ శాంతి భద్రతల విఘాతానికి దారితీయవచ్చని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భాగెల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం టీకాలను రాష్ట్రాలకు తగినంతగా అందుబాటులోకి తీసుకురాకుండానే 18-44 ఏండ్ల వారికి అందిస్తామని చెప్పడమే దీనికి కారణమని అన్నారు. మూడో దశ వ్యాక్సినేషన్ కోసం కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రాలు అమలు చేయడం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. టీకాలను రాష్ట్రాలే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు.
మరోవైపు దేశంలో రెండు కంపెనీల కరోనా టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని భూపేశ్ భాగెల్ తెలిపారు. చాలా రాష్ట్రాలు కోటి, అరకోటి డోసులకు ఆర్డర్ చేశాయని, అయితే కంపెనీల నుంచి సరఫరాకు చాలా సమయం పడుతుందని అన్నారు. ఇక టీకాల అందుబాటు ఆధారంగా స్లాట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులు యువతలో గందరగోళానికి దారి తీసే అవకాశమున్నదని, దీంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆందోళనలకు ప్రేరేపించవచ్చని అభిప్రాయపడ్డారు. తద్వారా మూడో దశ వ్యాక్సిన్ డ్రైవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు లోపించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.