చోరీకి పాల్పడిన ఇంట్లో డబ్బు లేకపోవడంతో నోట్ రాసిన దొంగ
భోపాల్, అక్టోబర్ 11: తాళంవేసిన ఓ ప్రభుత్వాధికారి ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ భారీ మొత్తంలో డబ్బు, దస్కాన్ని దోచుకుందామనుకున్నాడు. అయితే, ఆ ఇంట్లో కొంత డబ్బే అతడికి దొరికింది. దీంతో నిరాశకు గురైన ఆ చోరుడు.. ఏకంగా ఆ అధికారికే ఓ లేఖ రాసిపెట్టి వెళ్లాడు. ఆ లేఖను సోమవారం స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఇంతకీ దొంగ రాసిన ఆ లేఖలో ఏమున్నదంటే.. ‘జబ్ పైసే నహీ థే.. తో.. లాక్ నహీ కర్నా కలెక్టర్ (కలెక్టర్ గారూ.. ఇంట్లో డబ్బు లేనప్పుడు.. ఇంటికి తాళం వేయకూడదు) అని రాసి ఉంది. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్నది. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ త్రిలోచన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సింగ్ ఇంట్లో నుంచి వెళ్తూ ఆ దొంగ రూ.30 వేల నగదు, కొన్ని నగలను తీసుకుపోయినట్టు పోలీసులు తెలిపారు.