Kangana Ranaut : బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి, మండి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్.. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా గో మాంసం తిన్నదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. తాను గో మాంసం తిన్నానని కాంగ్రెస్ నేతలు ఆరోపించారని, కానీ రుజువులు అడగగానే మాట దాటవేశారని కంగనా ఆరోపించారు. నాకు క్యారెక్టర్ లేదని ఆరోపణలు చేశారని, నా క్యారెక్టర్ గురించి చెప్తుంటే అవన్నీ మాకెందుకు అంటున్నారని ఆమె విమర్శించారు.
ఇవాళ మండి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మనాలిలో కంగనా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ సభలో ప్రసంగిస్తూ.. ‘మిత్రులారా కాంగ్రెస్ నేతలు అబద్ధపు కూతలు కూస్తున్నారు. మాయ మాటలు చెబుతున్నారు. వాళ్ల మాటలను అస్సలు నమ్మకండి. నేను గో మాంసం తిన్నా అని ఆరోపించారు. రుజువులు చూపండని నేను అడిగితే.. తమ దగ్గర రుజువులు లేవన్నారు. ‘నువ్వు ఏం తింటే మాకేంది..?’ అని హేళన చేశారు. అలాంటప్పుడు నేను గో మాంసం తిన్నట్లుగా తప్పుడు ప్రచారం చేయడం దేనికి..?’ అని ప్రశ్నించారు.
‘అంతేగాక నేను స్వచ్ఛమైనదాన్ని కాదని, నా క్యారెక్టర్ మంచిది కాదని ఆరోపించారు. అందుకే నా క్యారెక్టర్ ఏమిటో, నా చరిత్ర ఏమిటో నేను చెప్పుకున్నా. దాంతో నీ చరిత్ర గురించి మాకేం అవసరం అని ఎద్దేవా చేశారు’ అని కంగనా ఓటర్లకు గుర్తు చేశారు. కాబట్టి కాంగ్రెస్ మాటలను ప్రజలకు గమనించాలని, ఈ లోక్సభ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ నేతలకు బుద్ధి చెప్పాలని కంగనా పిలుపునిచ్చారు.