న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు. ఏప్రిల్ 19న తొలి దశ ఓటింగ్ ప్రారంభం కాగా జూన్ 1న చివరి దశ పోలింగ్ జరుగుతుందని చెప్పారు. (Lok Sabha Elections 2024) మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కేవలం ఒకే రోజు ఓటింగ్ జరుగనున్నది. అయితే మూడు రాష్ట్రాల్లో మాత్రం మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఏడు దశల్లో ఓటు వేయనున్నారు.
కాగా, జమ్ముకశ్మీర్ మినహా అన్ని కేంద్రపాలిత పాంత్రాల్లో ఒకే దశలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. జమ్ముకశ్మీర్లో లోక్సభ ఎన్నికలు ఐదు దశల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20న పోలింగ్ జరుగనున్నది.
మరోవైపు తొలి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న, రెండో దశ ఓటింగ్ ఏప్రిల్ 26న, మూడో దశ ఓటింగ్ మే 7న, నాలుగో దశ ఓటింగ్ మే 13న, ఐదవ దశ ఓటింగ్ మే 13న, ఆరో దశ ఓటింగ్ మే 25న, ఏడవ దశ ఓటింగ్ జూన్ 1న జరుగనున్నాయి. జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే దశలో పోలింగ్:
అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ ద్వీపం, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, లక్షద్వీప్, లడఖ్, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్ మరియు దాద్రా-నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూలో ఒకే దశలో పోలింగ్ జరుగనున్నది.
నాలుగు రాష్ట్రాల్లో రెండు దశల్లో పోలింగ్:
కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో రెండు దశల్లో లోక్సభ పోలింగ్ జరుగనున్నది.
రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లో పోలింగ్:
ఛత్తీస్గఢ్, అస్సాం రాష్ట్రాల్లో మూడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి.
మూడు రాష్ట్రాల్లో నాలుగు దశల్లో పోలింగ్:
ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో నాలుగు దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి.
ఒక రాష్ట్రం, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఐదు దశల్లో పోలింగ్:
మహారాష్ట్రతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో ఐదు దశల్లో లోక్సభ పోలింగ్ జరుగనున్నది.
మూడు రాష్ట్రాల్లో ఏడు దశల్లో పోలింగ్:
ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి.