న్యూఢిల్లీ/గాంధీనగర్, డిసెంబర్ 24: చైనాతో సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, జపాన్, దక్షిణకొరియా, సింగపూర్, థాయ్లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసింది. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం వెల్లడించారు. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినా లేదా జ్వరం లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్లో ఉంచనున్నట్టు చెప్పారు. గాంధీనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పైన పేర్కొన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిని తెలియజేసేందుకు ఎయిర్ సువిధ ఫామ్ను నింపడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
ఎయిర్పోర్టుల్లో ర్యాండమ్ పరీక్షలు
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శనివారం ఎయిర్పోర్టుల్లో అధికారులు ర్యాండమ్గా కొవిడ్ పరీక్షలు ప్రారంభించారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి విమానంలో 2 శాతం మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఆ ప్రయాణికులను సంబంధిత విమానయాన సంస్థలు ఎంపిక చేస్తాయని కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, భారత్లో ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విమానాలపై ఆంక్షలు, లాక్డౌన్ విధింపు వంటి చర్యలు అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మాక్ డ్రిల్స్ నిర్వహించండి..
పలు దేశాల్లో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏ అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు దవాఖానల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, తగినస్థాయిలో సిలిండర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వెంటిలేటర్లు వంటి ప్రాణాధార వ్యవస్థల పనితీరును సరిచూసుకోవాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. పీఎస్ఏ ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూసుకోవాలని, వాటిని చెక్ చేసేందుకు రెగ్యులర్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని పేర్కొన్నది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దవాఖానల్లో మౌలిక సదుపాయాల పనితీరు, నిర్వహణను సరిచూసుకోవడం ముఖ్యమని తెలిపింది.
చైనాలో కరోనా కల్లోలం
చైనా రాజధాని బీజింగ్తో సహా పలు నగరాల్లో కొవిడ్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కరోనా బారిన పడిన వారితో దవాఖానలు నిండిపోతున్నాయి. బెడ్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. అంత్యక్రియల నిమిత్తం శ్మశానవాటికలకు మృతదేహాలు భారీ సంఖ్యలో వస్తున్నాయని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఎన్ని దవాఖానలు తిరిగినా, కొవిడ్ బారిన పడిన తన బంధువుకు బెడ్ దొరకలేదని యావ్ రుయాన్ అనే వ్యక్తి వాపోయాడు. ఐసీయూలు నిండిపోవడంతో పాటు బెడ్లు లేకపోవడంతో.. రోగులు దవాఖాన కారిడార్లలోని బెంచీలపై, నేలపైనే పడుకొంటున్నారు.