కేసు: షాహీన్ అబ్దుల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇతరులు ప్రజా
ప్రయోజన వ్యాజ్యం: డబ్ల్యూపీ(సీ) నంబర్ 940/2022
దేశంలో విద్వేషపూరిత వాతావరణం నెలకొన్నది. కొన్ని అంశాల్లో ప్రజల దృష్టి మరల్చేందుకు కొందరు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదు.
విభిన్న మతాలు, విభిన్న కులాలు సామరస్యపూర్వక వాతావరణంలో జీవించకపోతే సౌభ్రాతృత్వాన్ని సాధించలేం. దేశ లౌకిక, ప్రజాస్వామ్య తత్వాన్ని కాపాడే బాధ్యత మాపై ఉన్నది. అది మా విధి.
ఇది 21వ శతాబ్దం.. కానీ మతం పేరుతో మనం ఎక్కడికి చేరుకున్నాం? లౌకిక రాజ్యంగా ఉండాల్సిన భారత్లో ప్రస్తుత వ్యవహారాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. భారతదేశం లౌకిక, సౌభ్రాతృత్వ దేశంగా ఉండాలని దేశ రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ప్రతి వ్యక్తి గౌరవానికి భరోసా కల్పించాలని, దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడాలని రాజ్యాంగ పీఠికలోని మార్గదర్శక సూత్రాలు పేర్కొంటున్నాయి.
– సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: విద్వేషాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ద్వేషపూరిత ప్రసంగాల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఇంత జరుగుతున్నా.. కఠిన చర్యలు తీసుకోకుండా మౌనముద్రలో ఉన్న కేంద్రంలోని మోదీ సర్కారు తీరును తూర్పారబట్టింది. విద్వేష వ్యాఖ్యలు చేసేవారిపై మతాలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలో ముస్లిం వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటిని అరికట్టేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్రాయ్ ధర్మాసనం.. విద్వేష ప్రసంగాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన అంశమని తెలిపింది. ‘ఇది 21వ శతాబ్దం. మతం పేరుతో మనం ఎక్కడికి పోతున్నాం? ప్రస్తుతం దేశంలో విద్వేష వాతావరణం అలుముకొన్నది. లౌకిక దేశంలో ఈ పరిస్థితి దిగ్భ్రాంతికరం. భారత రాజ్యాంగంలోని అధికరణం-51ఏ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని చెప్తున్నది. మతసమానత్వం ఉండాల్సిన దేశంలో ఇలాంటి ఘటనలా?’ అని ప్రశ్నించింది. ఢిల్లీలో 25 ఏండ్ల యువకుడి హత్యను ప్రస్తావిస్తూ.. హిందువులపై దాడులు చేసే వారి తలు, చేతులను నరికివేయాలంటూ విశ్వహిందూ పరిషత్ నేత జగత్ గురు యోగేశ్వర్ ఆచార్య వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు అశాంతికి దారితీస్తామని మండిపడింది.
ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవాళ్లపై అధికారులు సుమోటో కేసులు నమోదుచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎవరో వచ్చి ఫిర్యాదు చేస్తారని వేచిచూడవద్దని స్పష్టం చేసింది. కేసుల నమోదులో అలసత్వం వహిస్తే అధికార యంత్రాంగంపైనే కోర్టు ధిక్కార నేరం మోపుతామని హెచ్చరించింది. ‘కొన్ని అంశా ల్లో ప్రజల దృష్టి మరల్చేందుకు కొందరు ఇ లాంటి ప్రసంగాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి ని సహించే ప్రసక్తే లేదు. భారత్ లౌకిక దేశం అని రాజ్యాంగం చెప్పింది. దేశంలో ప్రతి ఒక్క రి వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా రాజ్యాంగ పీఠికను రాసుకొన్నాం’ అని వెల్లడించింది. దేశ లౌకిక, ప్రజాస్వామ్య తత్వాన్ని కా పాడే బాధ్యత తమపై ఉన్నదని న్యాయమూర్తు లు తెలిపారు. విభిన్న మతాలు, కులాలు సా మరస్యపూర్వక వాతావరణంలో జీవించకపోతే సౌభ్రాతృత్వాన్ని సాధించలేమని పేర్కొన్నారు.
పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్.. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ చేసిన ‘ఒక వర్గాన్ని బాయ్కాట్ చేయండి’ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ ఘటనలో కోర్టు, అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. ముస్లింలు కూడా ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారా? అని జస్టిస్ జోసెఫ్ అడగ్గా, ఎవరు ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినా సహించకూడదని సిబల్ తెలిపారు. దీంతో.. ‘ఆ మతం, ఈ మతం అన్న తేడా లేకుండా ద్వేషపూరిత వ్యాఖ్యలు వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. అలాగైతేనే భారత రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న లౌకిక తత్వాన్ని కాపాడగలం’ అని సుప్రీం స్పష్టం చేసింది.
ద్వేషపూరిత నేరాలు, ప్రసంగాలపై నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. ఇలాంటి ఘటనలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)ను ప్రయోగించాలని విన్నవించారు. దీంతో ఈ తరహా కేసుల్లో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొన్నారో నివేదిక అందజేయాలని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా గత నెల 21న జరిగిన విచారణను ధర్మాసనం గుర్తుచేసింది. దేశంలో విద్వేష ప్రసంగాల తంతు ఇంత జరుగుతున్నా.. మోదీ సర్కారు మౌనసాక్షిగా అంతా చూస్తున్నదే తప్ప, ఏం చేయట్లేదని, దేశంలో పార్టీలు వస్తాయి.. పోతాయి.. అయితే దేశం ఎప్పటికీ శాశ్వతమని గుర్తుంచుకోవాలని హితవు పలికింది. ‘శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని ఆర్టికల్ 51ఏ చెబుతున్నది. అయితే, మతంపేరిట దేశంలో ఏం జరుగుతున్నది? ఇది విషాదకరం’ అంటూ ధర్మాసనం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.