(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): గగన్యాన్, చంద్రయాన్-4 లాంటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాలకు సంసిద్ధమవుతున్న వేళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పెను కల్లోలం ఆందోళన కలిగిస్తున్నది. రాకెట్లు (లాంచ్ వెహికల్స్), రోజువారీ ఉపగ్రహాల తయారీ బాధ్యతల నుంచి ఇస్రో క్రమంగా తప్పుకోనున్నదని, ఇకపై ఆయా కార్యకలాపాలను ప్రైవేటు కంపెనీలే నిర్వర్తించనున్నట్టు ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రయోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఛైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకా ప్రకటించడం వివాదానికి దారి తీసింది. ప్రభుత్వ నిర్ణయంపై అటు ఇస్రో మాజీ చీఫ్లు, ఇటు రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఇస్రోను నిర్వీర్యం చేయడానికే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నదని ధ్వజమెత్తుతున్నారు.
ఆచరణ సాధ్యం కాదు
రాకెట్ల తయారీ సహా పూర్తి బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడాన్ని ఇస్రో మాజీ ఛైర్మన్ జీ మాధవన్ నాయర్ తప్పుబట్టారు. ‘ప్రయోగాలకు అత్యంత కీలకమైనది అసెంబుల్-టెస్టింగ్-లాంచింగ్ దశ. ఇప్పటి దాకా ఇదంతా ఇస్రో ఉన్నతాధికారులే చేస్తున్నారు. ఇప్పుడు ఈ పనులను కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తే, అది ఎంతమాత్రం సరైన చర్య అనిపించుకోదు’ అని నాయర్ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ఇస్రోను బలహీనపరుస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ మండిపడ్డారు.
వందలాది మంది రాజీనామా
ఇస్రోలో కీలక సైంటిస్టులు, ఇంజినీర్లు ఇటీవల వందలాది మంది స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలు చేయడం కలకలం సృష్టించింది. రాజీనామాల కోసం వచ్చే అభ్యర్థనలను అంగీకరించొద్దని ఇస్రోను కేంద్రం ఆదేశించింది. కేంద్రం విధానలు, అంతర్గత విభేదాలు, ప్రైవేటు రంగ రోదసి కంపెనీల నుంచి ఆఫర్ల కారణంగానే సైంటిస్టులు ఇస్రోను వీడుతున్నట్టు తెలుస్తున్నది.