న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో న్యూఇయర్ రోజున కారు ఈడ్చుకెళ్లడంతో మరణించిన అంజలి సింగ్ ఇంట్లో చోరీ జరిగింది. కరణ్ విహార్ ప్రాంతంలోని ఆమె కుటుంబం నివసిస్తున్న ఇంటి తాళం పగులగొట్టి ఉంది. సోమవారం ఉదయం 7.30 గంటలకు గమనించిన పొరుగువారు అంజలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ ఇంటికి వచ్చి పరిశీలించారు. రెండు నెలల కిందట కొత్తగా కొనుగోలు చేసిన ఎల్సీడీ టీవీతోపాటు మరికొన్ని వస్తువులు చోరీ అయినట్లు అంజలి సోదరి తెలిపింది. అలాగే మంచం కింద ఉండాల్సిన కొన్ని వస్తువులు కూడా మాయం అయ్యాయని చెప్పింది. అంజలి స్నేహితురాలు నిధికి ఈ చోరీతో సంబంధం ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. గత ఎనిమిది రోజులుగా ఆ ఇంటి వద్ద ఉన్న పోలీసులు ఆదివారం ఎందుకు లేరు? అని ప్రశ్నించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అంజలి ఇంట్లో చోరీపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
కాగా, జనవరి 1న ఉదయం 1.30 గంటలకు న్యూఇయర్ వేడుకల అనంతరం స్కూటీపై ఇంటికి వెళ్తున్న అంజలి సింగ్ను కారు ఢీకొట్టింది. ఆమె కాళ్లు కారు ముందు చక్రం భాగంలో ఇరుక్కోవడంతో పలు కిలోమీటర్ల దూరం అది ఈడ్చుకెళ్లింది. దీంతో అంజలి సింగ్ దారుణంగా మరణించింది.
మరోవైపు అంజలి స్కూటీపై వెనక కూర్చొన్న స్నేహితురాలు నిధి ఈ ప్రమాదం నుంచి బయటపడింది. అయితే ప్రమాదం విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గుట్టుగా తన ఇంటికి వెళ్లిపోయింది. స్కూటీపై నిధి కూడా ఉన్నట్లు దర్యాప్తులో తెలుసుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించారు. అయితే మద్యం సేవించిన అంజలి తనతో పోట్లాడి స్కూటీ నడిపిందని, వేగంగా డ్రైవ్ చేసి కారును ఢీకొట్టిందని నిధి ఆరోపించింది.
అయితే అంజలి మద్యం సేవించలేదని పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలిసింది. ఈ నేపథ్యంలో అంజలి కుటుంబ సభ్యులు నిధిపై అనుమానం వ్యక్తం చేశారు. అంజలి మరణానికి సంబంధించి ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నమోదైన డ్రగ్స్ కేసులో నిధిని కూడా అరెస్ట్ చేశారు.