న్యూఢిల్లీ, నవంబర్ 28: ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే జరిగిన మరో హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని పాండవ్ నగర్ ప్రాంతంలో గత మేలో ఓ మహిళ తన భర్తను చంపి, శవాన్ని పది ముక్కలుగా నరికి తూర్పు ఢిల్లీలోని అనేక చోట్ల వాటిని పారవేసింది. అంజన్ దాస్ (45) అనే వ్యక్తిని అతడి భార్య పూనం (48), ఆమె కుమారుడు దీపక్ (25) కలిసి హత్య చేసినట్టు పోలీసులు సోమవారం తెలిపారు. ఎలాంటి ఆధారం లభించకుండా తెలివిగా చేసిన హత్య కేసును పోలీసులు సుదీర్ఘంగా దర్యాప్తు అనంతరం ఛేదించారు. బీహార్కు చెందిన అంజన్ దాస్ కొన్నాళ్ల క్రితం ఉపాధి కోసం ఢిల్లీ వచ్చి లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతడికి బీహార్లో భార్య, 8 మంది కుమారులు ఉన్నారు.
మరోవైపు పూనంకు 14 ఏండ్ల వయసులోనే సుఖ్దేవ్ తివారీ అనే వ్యక్తితో పెండ్లి కాగా, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అతడు వారిని వదిలేసి వెళ్లిపోయాడు. భర్తను వెతుక్కొంటూ ఢిల్లీకి వచ్చిన పూనంకు కల్లూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారు సహజీవనం చేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పూనంతో అంజన్దాస్కు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. 2016లో కల్లూ మృతిచెందటంతో 2017లో దాస్, పూనం పెండ్లి చేసుకొన్నారు. అప్పటికే పూనంకు పెండ్లయిన కొడుకు, పెండ్లికి ఎదిగిన కూతురు ఉన్నారు. కొంతకాలం తర్వాత పూనం కూతురు, కోడలిపై దాస్ కన్నుపడిందని పూనం గుర్తించింది. తన కొడుకుతో కలిసి అతడిని హత్య చేయాలని గత మార్చి-ఏప్రిల్లోనే పథకం వేసింది.
తెలివిగా హత్య
గత మేలో దాస్కు పూనం శీతల పానీయంలో నిద్రమాత్రలు కలిపి తాగించింది. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాక కుమారుడితో కలిసి అతన్ని హత్య చేసింది. శరీరంలోని రక్తం మొత్తం వెళ్లిపోయేందుకు దాస్ గొంతుకోశారు. ఆ తర్వాత మృతదేహాన్ని పెద్ద కత్తులతో పది ముక్కలుగా నరికి ఇంట్లోని ఫ్రిడ్జిలో దాచారు. రోజుకు కొన్ని చొప్పున నాలుగు రోజులపాటు ఎవరికీ అనుమానం రాకుండా శరీర భాగాలను నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పారవేశారు. తలను ఓ చోట పాతిపెట్టారు. రామ్లీలా గ్రౌండ్ సమీపంలో ఓ బ్యాగులో మనిషి శరీర భాగాలు లభించటంతో గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదుచేసుకొని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో మరికొన్ని శరీర భాగాలను గుర్తించారు.
ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో దర్యాప్తు సవాలుగా మారింది. పాండవ్నగర్ ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి విచారించారు. చివరకు సోనం, దీపక్పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించగా వారు నిజం ఒప్పుకొన్నారు. లభించిన శరీర భాగాలు దాస్వేనని రూఢీ చేసుకొనేందుకు బీహార్లోని అతడి కుటుంబ సభ్యుల డీఎన్ఏతో పోల్చి చూడనున్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్య కూడా ఇలాగే జరిగిన విషయం తెలిసిందే. ఆమె ప్రియుడు శ్రద్ధను 30 ముక్కలుగా నరికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పారవేసినట్టు తేలింది.