పుట్టిన తేదీ: 1937 నవంబర్ 6, సొంత రాష్ట్రం: బీహార్
రాజకీయాల్లోకి రాకముందు: 24ఏండ్లపాటు ఐఏఎస్
ప్రజాప్రాతినిధ్యం: 1998, 1999, 2009లో ఎంపీగా..
హోదాలు: కేంద్ర ఆర్థిక, విదేశాంగశాఖ మంత్రిగా..
పుట్టిన తేదీ : 1958 జూన్ 20, సొంత రాష్ట్రం: ఒడిశా
రాజకీయాల్లోకి రాకముందు: టీచర్
ప్రజాప్రాతినిధ్యం: 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపు
హోదాలు: ఒడిశా రాష్ట్ర మంత్రిగా, జార్ఖండ్ గవర్నర్గా..
హైదరాబాద్ (నమస్తే తెలంగాణ), న్యూఢిల్లీ, జూన్ 21: రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచేది ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. అధికార, విపక్షాలు మంగళవారం తమ అభ్యర్థులను ప్రకటించాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ సన్నిహితుడు యశ్వంత్సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్పవార్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఎన్డీయే తరఫున జార్ఖండ్ మాజీ గవర్నర్, సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమె పేరును ఖరారు చేసినట్టు తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని కొంతకాలంగా చెప్తున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. తాజాగా జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. శరద్పవార్ నేతృత్వంలో మంగళవారం కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ సహా 17 పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశం నుంచే సీఎం కేసీఆర్తో శరద్పవార్ పలుసార్లు ఫోన్లో మాట్లాడి తమతో కలసి రావాలని విజ్ఞప్తిచేశారు. గత కొంతకాలంగా దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టడంలో ఇతర పార్టీలు సాహసించటం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే ధైర్యంతో బీజేపీని తూర్పార పడుతున్నారని శరద్పవార్ సీఎం కేసీఆర్తో చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ తమ వెంట ఉండాలని అన్ని ప్రాంతీయ పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారని చెప్పినట్టు తెలిసింది. జాతి ప్రయోజనాల రీత్యా విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.
రాష్ట్రపతి అభ్యర్థిగా సిన్హా ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు పవార్ ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండేందుకు పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, గోపాల్ కృష్ణ గాంధీ విముఖత చూపిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ సిన్హా పేరును తెరపైకి తెచ్చింది. విపక్ష పార్టీలన్నీ ఆయనకు మద్దతు తెలిపినట్టు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు. పవార్ నేతృత్వంలో జరిగిన భేటీకి కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సమాజ్వాదీపార్టీ, ఎంఐఎం తదితర పార్టీలు హాజరయ్యాయి. టీఆర్ఎస్, బిజూ జనతాదళ్, ఆప్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు దూరంగా ఉన్నాయి.
యశ్వంత్ సిన్హా 1937 నవంబర్ 6న బీహార్లో జన్మించారు. 1960 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సిన్హా.. 24 ఏండ్ల పాటు పలు హోదాల్లో పనిచేశారు. 1984లో ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు. 1998, 1999, 2009 ఎన్నికల్లో బీజేపీ తరఫున లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు. చంద్రశేఖర్ హయాంలో 1998-99 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో విదేశాంగశాఖ మంత్రిగా కూడా సేవలందించారు. అద్వానీకి సన్నిహితుడిగా సిన్హాకు పేరుంది. 2018లో బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన.. 2021లో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు.
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామమైన బైడపోసిలో సంతాల్ గిరిజన తెగలో 1958 జూన్ 20న ద్రౌపది ముర్ము జన్మించారు. 2015 మార్చి 6 నుంచి 2021 జూలై 12 వరకు జార్ఖండ్ గవర్నర్గా ఆమె పనిచేశారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్గా ఆమె నియమితులయ్యారు. పైగా దేశ చరిత్రలో ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తి ఓ రాష్ర్టానికి గవర్నర్గా నియమితులైన నేత ఆమె కావడం విశేషం. ఒడిశాలోని రాయరంగాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్య, రవాణా శాఖ, మత్స్యసంపద, పశు సంవర్ధక శాఖ మంత్రిగా సేవలందించారు. ముర్ము రాజకీయాల్లోకి రాకముందు టీచర్గా కొంతకాలం పనిచేశారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరును ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని చాలా మంది ఊహించారు. మంగళవారం కేంద్రమంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలు వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి కలిశారు. ఐదేండ్లుగా ఉపరాష్ట్రపతిగా సేవలందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకోలేదని వెంకయ్య అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.