న్యూఢిల్లీ: యూనియన్ ఆఫ్ ఇండియాకు బదులు ‘యూనియన్ ఆఫ్ భారత్’గా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఓ సర్క్యులర్ జారీచేయటం వార్తల్లో నిలిచింది. ఏయే అంశాల్లో వాయిదాలను కోరరాదో తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులన్నింటికీ సుప్రీంకోర్టు తాజాగా మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీనికి సంబంధించి న్యాయవాదులకు జారీ చేసిన ఓ సర్క్యులర్లో ‘యూనియన్ ఆఫ్ భారత్’గా సుప్రీంకోర్టు పేర్కొనటం గమనార్హం.
గత ఏడాది భారత్లో జీ20 దేశాల సదస్సు నిర్వహించగా, జీ20 దేశాధినేతల విందు కార్యక్రమానికి కేంద్రం పంపిన ఆహ్వానంలో భారత రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా మోదీ సర్కార్ పేర్కొనటం అప్పట్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దేశం పేరు.. ఇండియా నుంచి భారత్కు మార్చనున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే రెండు పదాల్ని కూడా వాడొచ్చునని కొంతమంది న్యాయ నిపుణులు కేంద్ర చర్యల్ని సమర్థించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-1ను ప్రస్తావిస్తూ, ‘ఇండియా, భారత్ రెండూ ఒకటేనని గుర్తుచేశారు.