న్యూఢిల్లీ : లైంగికదాడి కేసు విచారణలో జ్యోతిషం ఎందుకొచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రజల నమ్మకాలు, మనోభావాలను తాము గౌరవిస్తామని కానీ లైంగికదాడి బాధితురాలికి న్యాయం కోసం విచారణ జరగాల్సిన చోట జ్యోతిషం గురించి ఎందుకు చర్చిస్తున్నారని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
లైంగికదాడి చేసి కుజ దోషం ఉందన్న కారణం చూపి పెళ్లికి నిరాకరిస్తున్నాడని దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు ఇటీవల విచారణ చేసింది. సదరు బాధితురాలి జాతకంలో కుజ దోషం ఉందో లేదో నిర్ధారించాలంటూ లక్నో యూనివర్సిటీలోని జ్యోతిషం విభాగాన్ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పది రోజుల్లోపు బాధిత మహిళ జాతకాన్ని లక్నో యూనివర్సిటీ జ్యోతిష విభాగం ముందు ఉంచాలని ఆదేశించింది.