న్యూఢిల్లీ, జూన్ 15 (నమస్తే తెలంగాణ): దాదాపు 60 ఏండ్లుగా వివాదంలో ఉన్న హైదరాబాద్లోని హైదర్నగర్ భూముల కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం 196.20 ఎకరాలకు సంబంధించిన భూ వివాదంపై సుదీర్ఘకాలంగా వాదనలు జరుగుతున్నాయి. ఆ భూ వివాదంలో 11 ఎకరాలపై తీర్పు చెప్పింది. గోల్డ్స్టోన్ సంస్థ దాఖలు చేసిన ఎల్ఎల్పీలను కొట్టేసింది. నిజాం కాలంలో సాగు పట్టాలు కలిగి ఉన్నవారి నుంచి భూములు కొన్న వారికి మాత్ర మే భూ యాజమాన్య హక్కులు ఉంటాయని తేల్చింది.
ఆ పట్టాదారుల నుంచి భూములు కొనుగోలు చేసిన వారికి, వారి ద్వారా సొసైటీలు, సొసైటీల ద్వారా సభ్యులు కొనుగోలు చేసిన వారికే సదరు భూమి హక్కులు చెల్లుతాయని జస్టిస్ వీ రామసుబ్రమణియం, జస్టి స్ పంకజ్మిత్తల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. వీరికి మాత్రమే భూములపై హక్కులు ఉంటాయంటూ గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ గోల్డ్స్టోన్ సంస్థ, ఇతరులు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. హైదర్నగర్లోని 196.20 ఎకరాల విషయంలో సుదీర్ఘ కాలంగా భూవివాదం కొనసాగుతున్నది. ఇందులో 11 ఎకరాల విషయంపై 132 పేజీలతో కూడిన సుదీర్ఘ తీర్పును వెలువరించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ట్రినిటీ, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను అనుసరించి తీర్పును తొమ్మిది విభాగాలుగా విభజిస్తూ వాటిని ఎందుకు కొట్టేస్తున్నదీ తెలియజేసింది. ప్రధానంగా నిజాం కాలం నాటి పైగా, ఎస్టేట్, పర్వానా, సనద్ల కింద భూములివ్వడం వంటి అంశాల గురించి తీర్పులో పేర్కొన్నది. మొత్తం 196.20 ఎకరాల్లో కేవలం 11 ఎకరాలకు సంబంధించిన భూ వివాదంపై మాత్రమే విచారణకు తీసుకున్న కోర్టు ఆయా భూములకు సంబంధించిన హక్కుదారులు క్లెయిమ్ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. మిగిలిన సుమారు 185.20 ఎకరాల భూముల హక్కుదారులను తేల్చాల్సి ఉన్నదని తెలిపింది. 11 ఎకరాలపై మాత్రమే దావా వేసిన పిటిషనర్లకు భూహక్కులు ఉంటాయని చెప్పింది.