Census-based Delimitation | 2026లో కేంద్రం తీసుకురావాలనుకొంటున్న ‘జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విధానం’తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగనున్నది. దేశదేశ జీడీపీలో దక్షిణాది రాష్ర్టాల వాటా 33 శాతం కాగా.. పార్లమెంటులో మాత్రం వాటి ప్రాతినిధ్యం కేవలం 20 శాతానికే పరిమితం కానున్నది.
అనగనగా ఓ రాజు ఉండేవాడు. ఆయన దగ్గర ఐదుగురు సేవకులుండేవారు. మొదటివాడు నిజాయితీపరుడు. చక్రవర్తి ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు చేస్తాడు. రేయింబవళ్లు కష్టపడి ఖజానాకు మూడింట ఒక వంతు ఆదాయాన్ని తెచ్చి పెడతాడు. మిగతా నలుగురు బద్ధ్దకస్తులు. రాజు ఆదేశాలను పట్టించుకోరు. ఆదాయాన్ని తేవడంలోనూ వెనుకంజే. అయినప్పటికీ, సంఖ్య ఎక్కువగా ఉన్నదన్న కారణంతో ఈ నలుగురినే రాజు గౌరవంగా, ప్రేమగా చూసుకొంటున్నారు. వారికే కీలక నిర్ణయాలు తీసుకొనే అధికారాన్ని కట్టబెడుతున్నాడు. ఇది న్యాయమా? దక్షిణాది రాష్ర్టాల విషయంలో ‘జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విధానం’ తీరు కూడా ఇలాగే ఉన్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): 2026లో తీసుకురావాలనుకొంటున్న ‘జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విధానం’తో దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగనున్నది. జనాభా నియంత్రణలో గత కొన్నేండ్లుగా క్రమశిక్షణతో ముందుకు సాగుతున్న దక్షిణాది రాష్ర్టాలకు ఇప్పుడు ఆ క్రమశిక్షణే పెద్ద ‘రాజకీయ శిక్ష’గా మారనున్నది. జాతీయ లక్ష్యాల సాధన పేరిట కేంద్రంలోని గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన జనాభా నియంత్రణ అమలును గాలికొదిలేసిన ఉత్తరాది రాష్ర్టాలు.. ఇప్పుడు పార్లమెంట్లో ఆధిపత్యం చెలాయించనున్నాయి. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం యోచిస్తున్నది. ఇదే జరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి అత్యధిక జనాభా కలిగిన ఉత్తరాది రాష్ర్టాలకు లోక్సభ సీట్లు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగనున్నాయి. ఉత్తరాది రాష్ర్టాల్లో ఎక్కువ స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉన్న బీజేపీ వంటి పార్టీలకు ఇది అనుకూలంగా మారనున్నది.
ప్రాతినిధ్యానికి ప్రమాదం
లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను గుర్తించడానికి పదేండ్లకోసారి జన గణన ప్రాతిపదికగా డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుత లోక్సభలోని 543 నియోజకవర్గాలను 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ధారించారు. అనంతరం జనాభా నియంత్రణ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణ పాటించగా, ఉత్తరాదిలో జనాభా విస్ఫోటనం సంభవించింది. దీంతో ఉత్తరాదిలోనూ జనాభా నియంత్రణ పద్ధతులు పాటించి జనాభా సమతుల్యత తీసుకురావాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగానే, డీలిమిటేషన్ చట్టం-2002 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనను 2026 దాకా నిలిపేశారు. కానీ ఉత్తరాదిన జనాభా నియంత్రణ లక్ష్యం నెరవేరలేదు. ఇదే సమయంలో గడువు కూడా దగ్గరికి వస్తున్నది. దీంతో 2026లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాలను సవరించాలని యోచిస్తున్నారు. ఇదే జరిగితే, దక్షిణాది రాష్ర్టాలు పార్లమెంట్లో తమ ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది.
బీహార్ అలా.. తెలంగాణ ఇలా..
తెలంగాణలో 17 లోక్సభ సీట్లు ఉన్నాయి. రాష్ట్ర జనాభా 3.8 కోట్లు. జనాభాను లోక్సభ సీట్లతో గణిస్తే 22 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ఉన్నట్టు లెక్క. అదే బీహార్ను పరిశీలిస్తే ఆ రాష్ట్ర జనాభా 12.6 కోట్లు. లోక్సభ సీట్లు 40. అంటే, 32 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ఉన్నట్టు అర్థమవుతున్నది. ఈ లెక్కన ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎంపీ స్థానాలను సవరిస్తే బీహార్ లోక్సభ స్థానాలు రెట్టింపవుతాయి. అంటే జనాభా నియంత్రణను సరిగ్గా అమలు చేయని బీహార్కి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది.
జాతీయ ప్రయోజనాలను ఆశించి జనాభా నియంత్రణను పాటించిన తెలంగాణ వంటి దక్షిణాది రాష్ర్టాలకు పార్లమెంట్లో సీట్లు తగ్గనున్నాయి. దేశ జనాభా వృద్ధి రేటు సగటున 14 శాతంగా ఉన్నది. ఉత్తరాది రాష్ర్టాల్లో ఇది జాతీయ సగటు కంటే 4 శాతం అధికం అంటే 18-19 శాతంగా ఉన్నది. దక్షిణాది రాష్ర్టాల విషయంలో ఇది జాతీయ సగటు కంటే 6-7 శాతం తక్కువగా ఉన్నది. ఈ లెక్కన 2026లో జరుగబోయే డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ర్టాల్లో నియోజకవర్గాల సంఖ్య తగ్గనున్నది. ఇదే సమయంలో ఉత్తరాదిలో పార్లమెంట్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
జీడీపీలో వాటా ఎంతున్నప్పటికీ..
దేశ జీడీపీలో దక్షిణాది ఐదు రాష్ర్టాల (తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ) వాటా 33 శాతం. మిగతా 24 రాష్ర్టాలది 67 శాతం. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసి దక్షిణాది రాష్ర్టాలు దేశ వికాసానికి సాయపడ్డాయి. ఉత్తరాది రాష్ర్టాలు మాత్రం ఈ విషయంలో చతికిలపడ్డాయి. అయితే, మూడింట ఒక వంతు సంపదను దేశానికి ఇస్తున్న దక్షిణాది రాష్ర్టాలకు రానున్న కాలంలో 165 లోక్సభ సీట్లను (20 శాతం), మిగతా రాష్ర్టాలకు 683 స్థానాలను (80 శాతం) కట్టబెట్టాలనుకొంటున్నారు. ఇప్పటికే భాష, సంస్కృతి, నిధుల పంపకం, రాజకీయ ప్రాధాన్యాల విషయాల్లో ఉత్తరాదితో పోలిస్తే వివక్షకు గురవుతున్న దక్షిణాది రాష్ర్టాలకు ఢిల్లీ గద్దెనెక్కాల్సిందెవరో నిర్ణయించే అంశంలోనూ తగిన ప్రాధాన్యం దక్కని పరిస్థితి నెలకొంది. దేశ ప్రగతి కోసం జనాభాను నియంత్రించడమే తప్పా? అంటూ దక్షిణాది రాష్ర్టాల హక్కుల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘నియోజక వర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ కింద దక్షిణాది రాష్ర్టాల్లోని పార్లమెంట్ సీట్ల సంఖ్యను తగ్గిస్తే.. అది న్యాయాన్ని అపహాస్యం చేసినట్టే. అనేక అభివృద్ధి సూచీలతో పాటు జనాభా నియంత్రణలోనూ దక్షిణాది రాష్ర్టాలు మెరుగైన పురోగతి సాధించాయి. అయితే జనాభా సాకు చూపి ఇప్పుడు పార్లమెంట్లో దక్షిణాదికి సీట్ల సంఖ్యను తగ్గించడం ఆ రాష్ర్టాలను శిక్షించడమే అవుతుంది.’
-ఆగస్టు 26, 2022న రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్
ఐదు కీలకాంశాల్లో టాప్-5లో దక్షిణాది రాష్ర్టాలు
తలసరి ఆదాయం
రూ. 3.17 లక్షలతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. జాతీయ సగటు రూ.1.7 లక్షల కంటే ఇది 86 శాతం ఎక్కువ. తలసరి ఆదాయంలో టాప్-5 స్థానాల్లో దక్షిణాది రాష్ర్టాలే ఉన్నాయి. జాతీయ సగటు కంటే ఈ రాష్ర్టాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది.
జీఎస్డీపీ-రుణాల నిష్పత్తి
జీఎస్డీపీలో రుణాల వాటా ఎంత తక్కువగా ఉంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా అంత బలోపేతంగా ఉన్నట్టు. ఈ విషయంలో తెలంగాణే (25.3 శాతం) తొలి స్థానంలో ఉన్నది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (27.5 శాతం), తమిళనాడు (27.7 శాతం), ఏపీ (32.8 శాతం), కేరళ (37.2 శాతం) ఉన్నాయి.
వడ్డీల చెల్లింపు
తక్కువ వడ్డీలను చెల్లిస్తూ తెలంగాణ (11.3 శాతం) టాప్ ప్లేస్లో నిలవడమే కాదు.. మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (14.3 శాతం), ఏపీ (14.3 శాతం), కేరళ (18.8 శాతం), తమిళనాడు (21 శాతం) ఉన్నాయి. పన్ను రాబడులు, స్థూల ద్రవ్యలోటు సూచీల్లోనూ దేశంలోని అన్ని రాష్ర్టాలను తోసిరాజని దక్షిణాది ఐదు రాష్ర్టాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.