లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న సంగీతప్రధాన చిత్రం ‘సింగ్ గీతం’. ప్రముఖ దర్శకుడు నాగ్అశ్విన్ నిర్మిస్తున్నారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రధారులు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర కథానాయిక అహల్యా బమ్రూ విలేకరులతో ముచ్చటించింది. తన నేపథ్యం గురించి చెబుతూ ‘మాది పుదుచ్చేరి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, బెంగాలీ భాషలు మాట్లాడే ఓ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పెరిగాను.
నా ఇన్స్టాగ్రామ్ కంటెంట్ చూసి నాగ్అశ్విన్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆడిషన్ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారానే ఇచ్చాను’ అని చెప్పింది. ఈ సినిమాలో తాను బలమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, ఇందులో విలన్ క్యారెక్టర్లో కూడా అమ్మాయే నటించిందని తెలిపింది. ‘కథాపరంగా కూడా ఇది కొత్త జోనర్ సినిమా. ఇలాంటి కథను ఇంతవరకు చూసి ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో పనిచేయడం ఆనందంగా ఉంది. మహేష్బాబు నా ఫేవరేట్ హీరో. యాక్షన్ సినిమాలు చేయాలన్నది నా డ్రీమ్’ అని అహల్యా బమ్రూ చెప్పింది.