న్యూఢిల్లీ, మే 23: మరికొద్ది గంటల్లో పెండ్లి ఉందనగా పెండ్లి మంటపానికి రాకుండా వరుడు పారిపోయాడు. వధువు ఏడుస్తూ కూర్చోలేదు. మరికొంత మంది సాయంతో 20 కిలోమీటర్లు వెంబడించి వరుడ్ని పట్టుకుంది. మంటపానికి లాక్కొచ్చి మరీ పెండ్లి చేసుకుంది. సినిమా కథను తలపించే స్థాయిలో ఛేజింగ్ సన్నివేశాలతో ఉత్తరప్రదేశ్లోని బరేలీ పట్టణంలో తాజాగా ఈ వివాహం జరిగింది. బారాబంకీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బదౌన్ జిల్లాకు చెందిన వరుడు, బరేలీకి చెందిన వధువు ఇద్దరూ గత రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు.
ఆదివారం బరేలీలోని భుటేశ్వర్నాథ్ గుడిలో పెండ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. వివాహ ముహూర్తం దాటుతున్నా వరుడు రాకపోయేసరికి, వధువు, ఆమె తరఫు బంధువులకు అనుమానం వచ్చింది. వరుడు పారిపోతున్న సంగతి తెలుసుకొని వారంతా వెంటనే రంగంలోకి దిగారు. బరేలీకి 20 కిలోమీటర్ల దూరంలో ఓ బస్స్టాండ్ వద్ద వరుడ్ని పట్టుకున్నారు. దీంతో కొన్ని గంటలపాటు అక్కడ హై ఓల్టేజీ డ్రామా చోటుచేసుకుంది. పారిపోతున్న వరుడ్ని మంటపం వద్దకు లాక్కొచ్చి మరీ.. వధువు వివాహం చేసుకోవటంతో చివరికి కథ సుఖాంతమైంది.