న్యూఢిల్లీ/అహ్మదాబాద్, జూలై 24: గుజరాత్లో కురిసిన వర్షాలకు రాజధాని అహ్మదాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణం నీటిలో చిక్కుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఎయిర్పోర్టును అదానీ సంస్థ నిర్వహిస్తున్నది. విమానాశ్రయ కారిడార్లోకి నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి రికార్డు చేసి, వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
కారిడార్లో భారీగా నీరు చేరడంతో ప్రయాణికులు అందులోనే నడుచుకుంటూ, ఆ నీటిలోనే లగేజీ బ్యాగ్లను ఈడ్చుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ దుస్థితిని ఆ ప్రయాణికుడు వీడియోలో వివరిస్తూ.. ‘ ఇదీ ప్రధాని మోదీ సొంత నగరంలోని పరిస్థితి’, ‘ఇదీ గుజరాత్, గొప్పగా చెప్పుకొనే ఎయిర్పోర్టులో నెలకొన్న దుస్థితి’ అని విమర్శించారు. మరోవైపు ఐదు రోజుల క్రితమే అండమాన్ నికోబార్లోని పోర్టుబ్లెయిర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ బిల్డింగ్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అప్పుడే కొన్ని చోట్ల భవన సీలింగ్ కూలిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. పనుల్లో నాణ్యత లేకపోవడమే ఇందుకు కారణమని నెటిజన్లు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
శిథిలాల కింద 15 మంది!
భారీ వర్షాల కారణంగా గుజరాత్లోని జునాగఢ్లో ఓ రెండతస్తుల భవనం కుప్పకూలింది. దాదాపు 15 మంది శిథిలాల కింద చిక్కుకొన్నట్టు తెలుస్తున్నది. నలుగురి మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు.