పాట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్పై తాము కేసులు నమోదు చేయలేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు లాలూ యాదవ్తో ఉన్నవారే ఆయనపై కేసులు నమోదు చేశారని చెప్పారు. పశు దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో రాంచీ సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.60 లక్షల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పుపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. తాము లాలూపై కేసులు నమోదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయనతో ఉన్న వ్యక్తులే కేసులు నమోదు చేశారని విమర్శించారు.
కాగా, లాలూ యాదవ్పై కేసులు నమోదు చేసిన వ్యక్తులు తన వద్దకు కూడా వచ్చారని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అయితే దీనికి తాను నో చెప్పానని అన్నారు. కేసులు పెట్టాలనుకుంటే మీరు ఆ పని చేయవచ్చని, అది తన పని కాదని వారితో అన్నట్లు చెప్పారు.
మరోవైపు బీహార్లో కుల గణన చేసేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అది ఎలా చేయాలో అన్న దానిపై అందరి ఆలోచనలు, వారి అనుభవాన్ని తీసుకోవడానికి త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కుల గణన అందరికీ మేలు చేస్తుందని ఆయన అన్నారు. కుల గణనను త్వరలో ప్రారంభించడంతోపాటు అది సక్రమంగా జరిగేలా చూస్తామన్నారు.