Odisha Train Accident | న్యూఢిల్లీ, హైదరాబాద్ (నమస్తే తెలంగాణ) జూన్ 3 : రైలు ప్రమాదంపై విపక్షాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. యాంటీ-కొలైజన్ పరికరాలు ఎందుకు పని చేయడం లేదని, వాటికి ఏమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒడిశా ప్రమాదం ఘోరమైన దుర్ఘటన అని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని ఆయన ప్రార్థించారు. రైల్వే ప్రమాదాలు, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాను గతంలో లోక్సభలో ప్రస్తావించానని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు.
ఒడిశా రైలు ప్రమాదం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ అన్నారు. ఈ దుర్ఘటనకు రైల్వే శాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని సీపీఐ, ఆర్జేడీ డిమాండ్ చేశాయి. ‘ఈ శతాబ్దంలోని పెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటైన ఈ దుర్ఘటనపై తప్పనిసరిగా సమగ్ర విచారణ విచారణ జరగాలి’ అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. యాంటీ-కొలైజన్ వ్యవస్థ ఎందుకు పని చేయలేదన్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రచార యావ తప్ప ప్రయాణికుల భద్రత పట్టలేదని ఆప్ జనరల్ సెక్రటరీ సందీప్ పాఠక్ విమర్శించారు. సీపీఐ, ఆర్జేడీ, ఎన్సీపీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామాకు డిమాండ్ చేశాయి. లాల్ బహదూర్ శాస్త్రి అప్పట్లో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గుర్తు చేశారు.