బహ్రిచ్ (యూపీ), జూన్ 4: పెండ్లి బాజాలు మోగిన కొన్ని గంటలలోనే ఆ ఇంట్లో చావుమేళం మోగింది. నవ దంపతులు గుండెపోటుతో మరణించిన ఘటన యూపీలో జరిగింది. బహ్రిచ్ జిల్లాకు చెందిన ప్రతాప్ యాదవ్ (22), పుష్ప(20) మే 30న వివాహం చేసుకున్నారు.
పెండ్లి తర్వాత దంపతులు రాత్రి తమ గదిలో నిద్రించారు. తెల్లారి చూసేసరికి ఇద్దరూ విగతజీవులై కన్పించారు. వారు ఎలా మరణించారో తెలియక బంధువులు పోలీసులను ఆశ్రయించారు. నవ దంపతులిద్దరూ గుండెపోటుతోనే మరణించినట్టు పోస్టుమార్టంలో తేలింది. దీంతో వారిద్దరి మృతదేహాలను ఒకే చితిపై ఉంచి అంతిమ సంస్కారం నిర్వహించారు. పెద్దఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామస్తులు దంపతులిద్దరికీ కన్నీటి నివాళి అర్పించారు.