న్యూఢిల్లీ, మార్చి 18: కేరళలోని బ్రహ్మపురం డంపింగ్ యార్డ్లో మంటలు చెలరేగడంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం యార్డ్ను నిర్వహించని కొచ్చి కార్పొరేషన్కు రూ.100 కోట్ల జరిమానా విధించింది. నెలలోపు ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జమ చేసి బాధితుల ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
బాధ్యులైన అధికారులపై క్రిమినల్, విభాగపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బ్రహ్మపురం డంపింగ్ యార్డ్లో ఈ నెల 2న మంటలు చెలరేగడంతో పరిసరాల్లోని ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని ది హిందూ పత్రిక ఈ నెల 6న కథనాన్ని ప్రచురించింది. దీన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ.. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేరళ అధికారులను ఆదేశించింది.