Bharatmala | పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన నరేంద్రమోదీ ప్రభుత్వం.. ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న రోడ్లు, రహదారుల నిర్మాణ ప్రాజెక్టులను సైతం సజావుగా ముందుకు సాగనివ్వడం లేదు. గత కొంతకాలం నుంచి నగదు ప్రవాహంలో ఎదురవుతున్న సవాళ్లు, రుణ సమస్యలతో రోడ్ల నిర్మాణానికి ఆర్డర్లు ఇవ్వడంలో కేంద్రం వెనుకంజ వేస్తున్నది. ఈ ధోరణులు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ ప్రాజెక్టులు నత్తనడకన సాగడం ఖాయంగా కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంతోపాటు ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల మంజూరులో ఉత్సాహం చూపలేదని, ఈ ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో కూడా కొనసాగవచ్చని ప్రముఖ విదేశీ బ్రోకరేజీ సంస్థ ‘నొమురా’ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12,731 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఆర్డర్లు ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ.. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఆర్డర్లను 12,376 కిలోమీటర్లకు తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్లో కేవలం 114 కి.మీ. రోడ్ల నిర్మాణానికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చింది. ఇది నిరుటి ఏప్రిల్లో ఇచ్చిన ఆర్డర్ల కంటే 43 శాతం తక్కువ. అంతేకాకుండా 2020 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అత్యంత కనిష్ఠం.
దేశంలో రహదారుల నిర్మాణం 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యంత గరిష్ఠ స్థాయికి చేరింది. ఆ ఏడాది రోజుకు సగటున 37 కి.మీ. రహదారుల నిర్మాణం జరిగింది. కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ఈ సగటు 30.11 కిలోమీటర్లకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో 12,500 కి.మీ. రహదారులను నిర్మించాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకొన్నప్పటికీ కేంద్ర రవాణా శాఖ 12,375 కి.మీ. రహదారుల నిర్మాణానికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చింది. కానీ, వాస్తవంగా నిర్మించిన రహదారుల పొడవు 10,993 కి.మీ. మాత్రమే. ఇది ప్రభుత్వ లక్ష్యం కంటే 13.70 శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోడ్ల నిర్మాణ వేగాన్ని 16 నుంచి 21 శాతం మేరకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు ప్రముఖ రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ గత నెలలో వెల్లడించింది. కానీ, 2023-24 చివరి త్రైమాసికంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తంగా ఇచ్చే రోడ్ల నిర్మాణ ఆర్డర్లు 9,500 కిలోమీటర్లకు మించకపోవచ్చని ‘ఇక్రా’ అభిప్రాయపడింది.
దేశంలో ఇప్పటికే భూసేకరణ ఖర్చులు భారీగా పెరిగాయి. దీనికి తోడు కొవిడ్ ముందు నాటితో పోలిస్తే స్టీల్ ధర 50%, సిమెంట్ ధర 14%, డీజిల్ ధర 36%, తారు ధర 46% పెరిగింది. దీంతో రోడ్ల నిర్మాణ ప్రాజెక్టుల వ్యయం అధికమైనట్టు ‘నొమురా’ వెల్లడించింది. దీని వల్ల కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా పరిగణిస్తున్న ‘భారత్మాల’ ప్రాజెక్టు వ్యయం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) వేసిన అంచనా కంటే రెండు రెట్లు అధిక స్థాయికి పెరగవచ్చని అభిప్రాయపడింది. ఎన్హెచ్ఏఐ ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోవడం, మరోవైపు ప్రాజెక్టుల వ్యయం నానాటికీ పెరుగుతుండటంతో రహదారుల నిర్మాణ ప్రాజెక్టులు మరింత జాప్యం కావచ్చని ‘నొమురా’ స్పష్టం చేసింది.