న్యూఢిల్లీ: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యాయత్నంపై అమెరికా చేసిన ఆరోపణల్ని సీరియస్గా తీసుకుంటున్నట్టు భారత్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ చేసిన ఆరోపణలు.. తమను ఆందోళనకు గురిచేశాయని, దీనిపై భారత్ అత్యున్నత స్థాయి కమిటీ విచారణ జరుపుతున్నదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మీడియా ముఖంగా వెల్లడించారు. ‘అమెరికా కోర్టులో కేసు నమోదైంది.
భారత నిఘా అధికారి, భారతీయ పౌరుడు హత్య కుట్రలో భాగస్వామైనట్టు నేరారోపణలు నమోదయ్యాయి. ఇలాంటి కుట్ర పూరితమైన చర్యలు భారత ప్రభుత్వ విధానానికి విరుద్ధం. అమెరికా ఆరోపణలు మమ్మల్ని ఆందోళన కలిగించాయి. దీనిపై విచారణ జరుపుతున్నాం’ అని బాగ్చీ అన్నారు. అమెరికా గడ్డపై భారత నిఘా అధికారి, నిఖిల్ గుప్తాలు పన్నూన్ హత్యకు కుట్ర చేశారని పేర్కొంటూ న్యూయార్క్ కోర్టులో కేసు నమోదైన సంగతి తెలిసిందే.