చెన్నై, జూలై 5: పోలీసులకుండే ప్రత్యేక అధికారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఉండవని మద్రాస్ హైకోర్టు తెలిపింది. అరెస్టు చేసిన వారిని 24 గంటల్లోపు న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. క్యాష్ ఫర్ జాబ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని కోర్టులో ప్రవేశపెట్టాలని కోరుతూ ఆయన సతీమణి ఎస్ మేఘల మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేశారు. జస్టిస్ జే నిషా భాను, జస్టిస్ డీ భారత చక్రవర్తిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించింది. అనంతరం జస్టిస్ భాను తీర్పును వెలువరించారు. ఈ కేసులో సెంథిల్ బాలాజీని ఈడీ కస్టడీకి తీసుకునేలా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి వెలువరించిన తీర్పు చట్టవిరుద్ధమని డివిజన్ బెంచ్ పేర్కొంది.
దేశంలో ఎవరూ సురక్షితంగా ఉండరు…
ఈడీకి అనేక అధికారాలను కట్టబెట్టారని, వాటిని న్యాయస్థానాలు అదుపు చేయకపోతే దేశంలో ఎవరూ సురక్షితంగా ఉండరని ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఢిల్లీకి చెందిన ఎం3ఎం రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించారు.