Internet effect | భోపాల్: ఇంటర్నెట్ కారణంగా యువతీయువకులు 14 ఏండ్లకే యుక్తవయసుకు చేరుకుంటున్నారని, యువతుల సమ్మతి వయసును 16 ఏండ్లకు తగ్గించే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సూచించింది. 20 ఏండ్ల వ్యక్తి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని 16 ఏండ్ల యువతి 2020లో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్ తాజాగా కొట్టివేశారు. యుక్తవయసుకు చేరుకుంటున్న యువతీయువకులు ఆకర్షణకు గురై శారీరకంగా ఒక్కటవుతున్నారని న్యాయస్థానం పేర్కొంది.
యుక్తవయసు వారు తమ జీవితానికి శ్రేయస్కరమైన నిర్ణయాలు తీసుకోగలరని అభిప్రాయపడింది. సమ్మతితో ఒక్కటైనప్పటికీ యువతుల వయసు కారణంగా యువకులు అన్యాయానికి గురవుతున్నారని తెలిపింది. 2012లో యవతుల సమ్మతి వయసును 16 నుంచి 18కి పెంచడం సమాజ నిర్మాణానికి భంగం కలిగించిందని వ్యాఖ్యానించింది.