న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: కర్ణాటకలో 105 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ( Visvesvaraya Iron and Steel Plant – విస్ప్)ను మూసివేసి కేంద్రప్రభుత్వం వందలమంది కార్మికులను రోడ్డున పడేసింది. ఈ స్టీల్ ప్లాంటును మూసివేస్తున్నట్టు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గత సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. ప్లాంటును మూసివేయొద్దని జనవరి 19 నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కేంద్రం వారి గోడును పట్టించుకోలేదు. ఈ ప్లాంటులో కాంట్రాక్టు కార్మికులే 1340 మంది ఉన్నారు. కేంద్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో 2017 నుంచి ఇందులో ఉత్పత్తి ఆగిపోయింది.
విస్ప్లో రక్షణ, రైల్వే, ఆటోమొబైల్, విద్యుత్తు రంగాలకు అవసరమైన ప్రత్యేక ఉక్కును తయారుచేసేవారు. ఈ ప్లాంటుకోసం 2011లో యూపీఏ ప్రభుత్వం బళ్లారి జిల్లాలోని ఎన్ఈబీ రేంజ్లో 140 ఎకరాల ఇనుప గనులు కేటాయించింది. దీనికి పక్కనే ప్రైవేటు గనులు కూడా ఉండటంతో సరిహద్దు వివాదం తలెత్తింది. అది కూడా 14 ఎకరాల విషయంలో మాత్రమే వివాదం నడుస్తున్నది. ఈ వివాదం సాకు చూపి మొత్తం గనినే పాలకులు పడావు పెట్టారు. 12 ఏండ్లుగా ఈ గనిలో తట్ట మట్టికూడా తవ్వలేదు. దీంతో ప్లాంటుకు ఇనుప ఖనిజం లభ్యత కరువైంది. ప్రభుత్వం తలుచుకొంటే ఒక్కరోజులో ఆ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించవచ్చని, కానీ కావాలనే నాటి యూపీఏతోపాటు, నేటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా వివాదాన్ని పరిష్కరించలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్లాంటుకు ఎన్ఈబీ పక్కనే రామనదుర్గలో మరో గని కూడా ఉన్నది. అయినా, కేంద్ర ప్రభుత్వం ఇనుప ఖనిజం లభించకపోవటంవల్లనే ప్లాంటును మూసివేస్తున్నామని ప్రకటించటం అర్థరహితం అని కార్మిక సంఘం నేత జే జగదీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విస్ప్ మూసివేతలో కేంద్రంతోపాటు కర్ణాటక ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ప్లాంటుకు మొదట కేటాయించిన గని వివాదంలో చిక్కుకోవటం, దానిని పరిష్కరించకుండా కేంద్రం నిర్లక్ష్యం వహించటంతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) రామనదుర్గ అటవీ ప్రాంతంలో ఈ ప్లాంటు కోసం 245.20 హెక్టార్లలో వేరే గని కేటాయించాలని 2013లోనే దరఖాస్తు చేసింది. కర్ణాటక ప్రభుత్వం ఆరేండ్లకు సెయిల్కు 150 హెక్టార్ల గనిని మాత్రమే కేటాయించింది. కొత్త గని కేటాయింపుతో ప్లాంటు మళ్లీ పట్టాలెక్కుతుందన్న కార్మికుల ఆశలపై కేంద్రం నీళ్లు కుమ్మరించింది. రామనదుర్గ గనిని కేటాయించిన నాలుగు నెలలకే విస్ప్ను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేటు పరం చేసేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. వివాదాల నేపథ్యంలో ప్లాంటును కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో గత ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ను కేంద్రం రద్దుచేసింది. ఇక విస్ప్ను నడుపలేమని, మూసివేతే మార్గమని ప్రకటించింది.
ప్రైవేటు వ్యక్తులకు ఒక్క రోజులో గనులు కేటాయించిన కర్ణాటక ప్రభుత్వానికి, విస్ప్కు ఒక్క గనిని ఇచ్చేందుకు చేతకాలేదు. రాజకీయ పార్టీలతో సంబంధాలున్న మైనింగ్ మాఫియా బళ్లారి జిల్లాలో గత 15 ఏండ్లుగా వేలకోట్ల విలువైన ఖనిజాన్ని దోచుకొన్నది. కానీ, విస్ప్లోని వందలమంది కార్మికులు రోడ్డునపడకుండా చూడాలని ప్రభుత్వం కనీస ఆలోచన చేయలేదు.
– విజయ్ భాస్కర్, ఏఐటీయూసీ కర్ణాటక రాష్ట్ర విభాగం కార్యదర్శి
ఇనుప ఖనిజం లభించకపోవటం వల్లనే ప్లాంటు మూసివేస్తున్నామని కేంద్రం చెప్పింది. విచిత్రమేమిటంటే కర్ణాటకలో ప్రైవేటు సంస్థకు అనేక గనులు కేటాయించారు. సెయిల్కు మాత్రం ఒక్క గని దొరకలేదు. ఈ ప్లాంటు నుంచి పుష్కలంగా ఖనిజ నిల్వలున్న బళ్లారి దూరం 250 కిలోమీటర్లు. విస్ప్కు మైనింగ్ లీజు 2011లో ఇచ్చినా, ఆచరణకు మోదీ సర్కారు ప్రయత్నించలేదు.
– జైరాం రమేశ్, కాంగ్రెస్ నేత