చెన్నై: వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) స్పెషల్ షోను పోలీసులు నిలిపివేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదు. అయినప్పటికీ శాంతిభద్రతల కారణాల వల్ల ఈ సినిమా షోలను థియేటర్ యజమానులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలోని ఒక ప్రముఖ థియేటర్లో ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రత్యేక షో కోసం ఏర్పాట్లు చేశారు. కొందరు బీజేపీ సీనియర్ నేతలను దీనికి ఆహ్వానించారు. అయితే సుమారు 12 మంది మాత్రమే ఈ స్పెషల్ షో చూసేందుకు వచ్చారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న చెన్నై పోలీసులు ఆ థియేటర్ వద్దకు చేరుకున్నారు. శాంతి భద్రతల కారణాలను పేర్కొని ‘ది కేరళ స్టోరీ’ స్పెషల్ షో నిలిపివేశారు. అయితే ఈ ప్రత్యేక షోను తాము నిర్వహించలేదని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి తెలిపారు. ఈ షోతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
మరోవైపు ఈ నెల 5న ‘ది కేరళ స్టోరీ’ విడుదల కాగా ఈ సినిమాను వ్యతిరేకిస్తూ తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తాయి. షోలు నిలిపివేయకపోతే థియేటర్లోని స్క్రీన్లను ధ్వంసం చేస్తామని కొన్ని సంఘాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో థియేటర్ యజమానులు ఈ నెల 7 నుంచి ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. కాగా, సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రమే ఇప్పటి వరకు అధికారికంగా ఈ సినిమాను నిషేధించింది.
Just In – Following the Ban of #TheKeralaStoryMovie in Tamil Nadu, a special screening for a few eminent BJP leaders was arranged at Le Magic Lantern Preview Theater in Chennai. However, Tamil Nadu Police Department strongly objected to it and the show is canceled now. pic.twitter.com/MRKNOuCtAr
— FridayCinema (@FridayCinemaOrg) May 10, 2023