Sengol | న్యూఢిల్లీ, మే 24: కొత్త పార్లమెంట్ భవనంలో లోక్సభ స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్న చారిత్రక రాజదండం ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది. ‘సెంగోల్’గా పిలిచే ఈ రాజదండాన్ని ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ మ్యూజియంలో ఉన్నది. భారత్ స్వాతంత్య్ర ప్రకటన సమయంలో బ్రిటీషర్ల నుంచి భారతీయులకు అధికార బదిలీకి ఈ రాజదండం నిదర్శనంగా నిలిచింది. దీన్ని బ్రిటీష్ చివరి వైస్ర్తాయ్గా ఉన్న లార్డ్ మౌంట్బాటెన్.. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు అందించారు. 1947, ఆగస్టు 14న అర్ధరాత్రి నెహ్రూ దీన్ని అందుకొన్నారు. సెంగోల్ అనే పదం తమిళ పదమైన ‘సెమ్మాయ్’ నుంచి వచ్చింది. సెమ్మాయ్ అంటే ధర్మం అని అర్థం.
భారత్కు స్వాతంత్య్రం ప్రకటించే సమయంలో, అధికార బదిలీకి గుర్తుగా ఏం చేద్దామని నెహ్రూను మౌంట్బాటెన్ అడిగారు. దీనికి నెహ్రూ తన పక్కనే ఉన్న భారతదేశ చివరి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి వైపు తిరిగి సలహా కోరారు. దీంతో కొత్త రాజు పట్టాభిషేకం సమయంలో రాజ్యం ప్రధాన పూజారి తన చేతుల మీదుగా రాజుకు రాజదండం అందించే తమిళ సంప్రదాయాన్ని వివరించారు. ఈ సంప్రదాయాన్ని చోళుల పాలనలో కూడా అనుసరించారని, ఇది చేద్దామని నెహ్రూకు రాజాజీ వివరించారట.
రాజదండం తయారీ కోసం రాజాజీ తమిళనాడులో ప్రఖ్యాత మఠమైన ‘తిరువడుత్తురై అథీనం’ను సంప్రదించారు. ఆ మాఠాధిపతి రాజదండం తయారీ బాధ్యతను అంగీకరించారు. ఉమ్మిడి బంగారు చెట్టి అనే స్వర్ణకారుడు సెంగోల్ను తయారు చేశారు. దీన్ని ఎత్తు 5 అడుగులు ఉండగా.. పైభాగంలో నందిని అమర్చారు. న్యాయానికి ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశారు.
తయారీ అనంతరం మఠానికి చెందిన ప్రధాన స్వామీజీ దాన్ని మొదట మౌంట్బాటెన్కు అందించారు. అధికార బదిలీకి గుర్తుగా దాన్ని తిరిగి వెనక్కు తీసుకొన్నారట. తర్వాత గంగా జలంతో శుద్ధి చేశారు. సెంగోల్ను పెద్ద ఊరేగింపుగా తీసుకెళ్లి నెహ్రూ చేతికి అందించారు. దీంతో తమిళ సంప్రదాయం ప్రకారం అధికారం బ్రిటీషర్ల నుంచి భారతీయుల చేతికి వచ్చింది.