శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నిప్పులు వెదజల్లుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మూడో తరం వాతావరణ శాటిలైట్ ‘ఇన్శాట్-3డీఎస్’ను భూకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ‘నాటీ బాయ్’ అని శాస్త్రవేత్తలు ముద్దుగా పిలిచే 2,274 కిలోల బరువు గల ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ రాకెట్ నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది.
వాతావరణ పరిశీలనను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాల్ని పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలు మరింత మెరుగుపడటానికి ఆస్కారముంది. ఈ శాటిలైట్ సేవల్ని భూ విజ్ఞాన, భారత వాతావరణ విభాగాలు వినియోగించుకుంటాయి. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన రెండో రాకెట్ ప్రయోగమిది.