న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అంటే ఉత్పత్తికి మార్కెట్లో విలువను పెంచడం మాత్రమే కాదని, రైతులకు ఒక నమూనా మార్పును సృష్టించడం కూడా దీని అర్థమని తెలిపారు. బుధవారం ఢిల్లీలో కృషి ఉడాన్ 2.0 పథకాన్ని ఆయన ప్రారంభించారు. త్వరగా పాడైపోయే వ్యవసాయ వస్తువులకు మార్కెట్ విలువను అందించడం, రైతు ఉత్పత్తులను మూరుమూల ప్రాంతాలకు విస్తరించడానికి తమ మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు.
బేబీకార్న్ కోసం అమృత్సర్-దుబాయ్, లిచీల కోసం దర్భంగా-మొత్తం భారతదేశం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం సిక్కిం-మొత్తం భారతదేశం, సముద్రపు ఆహారం కోసం చెన్నై-వైజాగ్-కోల్కతా నుండి ఫార్ ఈస్ట్, పైనాపిల్ కోసం అగర్తల-ఢిల్లీ-దుబాయ్, మాండరిన్ నారింజ కోసం దిబ్రూఘడ్-ఢిల్లీ-దుబాయ్, పప్పులు, పండ్ల కోసం గౌహతి-హాంకాంగ్ మధ్య కార్గో సర్వీసులను నడుపుతామని సింధియా తెలిపారు. ‘కృషి ఉడాన్ యోజన’పై ఎనిమిది ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.