న్యూఢిల్లీ: కొందరు నేతలు ఓటమి భయంతోనే తమ నియోజకవర్గ స్థానాలను వీడి మరో చోట పోటీ చేస్తున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. అలాగే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన సీటును విడిచిపెట్టారని విమర్శించారు. తాజాగా స్వామి ప్రసాద్ మౌర్య కూడా తన స్థానం నుంచి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి ఇటీవల సమాజ్వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్యపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పలు విమర్శుల చేశారు. ఆయన ప్రతి ఐదేండ్లకు కొత్త స్వామి (పార్టీ)ని ఎన్నుకుంటారని ఆరోపించారు. అయితే ఇప్పుడు చాలా కష్టంలో ఉన్న ఆయన తన సొంత స్థానం నుండి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. స్వామి ప్రసాద్ మౌర్య, పడ్రౌనా స్థానం నుండి పారిపోవాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు. ఆయన ఓటమి భయంతో ఉన్నారని, దీంతో ఆయన ఓడిపోవడం ఖాయమన్నారు.