న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధుల తగ్గింపుపై ఉపాధి కూలీలు మండిపడుతున్నారు. నిధులు తగ్గింపును పని హక్కుపై దాడిగా అభివర్ణిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో నరేగా పథకానికి గత ఏడాది రూ.73 వేల కోట్లు కేటాయించగా, 2023-24కు రూ.60 వేల కోట్లకు తగ్గించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది భారీగా నిధులు తగ్గించటంపై ది నరేగా సంఘర్ష్ మోర్చా, పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ సంఘాలు కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టాయి.
కేంద్ర నిర్ణయంపై మండిపడుతూ.. సోమవారం (ఈ నెల 6) నుంచి 100 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించాయి. కేంద్రం కేటాయించిన ఉపాధి బడ్జెట్ జీడీపీలో 0.198 శాతం మాత్రమేనని వివరించాయి. ప్రీ బడ్జెట్ నోట్లో నరేగా పథకానికి రూ.2.72 లక్షల కోట్లు కేటాయించాలని ప్రతిపాదించగా, మరీ ఇంత తక్కువగా కేటాయించటం కచ్చితంగా పని హక్కుపై దాడేనని స్పష్టం చేశాయి. పథకాన్ని పూర్తిగా నీరుగార్చేందుకు మోదీ సర్కారు పన్నిన కుట్ర అని మండిపడ్డాయి.