చెన్నై, ఆగస్టు 22: ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణంలో సమూల మార్పుకు నిర్ణయించింది. పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం సమావేశమైన నిర్వాహక కమిటీ పార్టీ పునర్ నిర్మాణానికి తొమ్మిది ప్రధాన తీర్మానాలు ఆమోదించింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలు కఠినంగా, కొందరికి కష్టంగా ఉండవచ్చునని స్టాలిన్ వ్యాఖ్యానించారు. పార్టీలోని వివిధ సంస్థాగత పదవులకు వయోపరిమితిని విధిస్తూ ప్రధాన నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
పార్టీలో యువ రక్తం ఎక్కించడానికి పార్టీ అధిష్ఠానం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు నేతలు తెలిపారు. పార్టీ జిల్లా స్థాయి కార్యదర్శి పదవులకు గరిష్ఠ వయోపరిమితి 70 ఏండ్లుగా నిర్ణయించడంతో పాటు, మూడుసార్లకు మించి పదవిని నిర్వహించరాదని ఆంక్షలు పెట్టింది. ప్రస్తుతమున్న 77 జిల్లా కమిటీల సంఖ్యను 110కి పెంచాలని నిర్ణయించారు.
జిల్లా యూనిట్ల సంఖ్యను పెంచుతున్నందున సిటీ యూనిట్ కార్యదర్శి అవసరం లేదని పేర్కొంటూ దానిని రద్దు చేశారు. స్థానిక విభాగాల్లో యువతకు ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో యూనిట్ కార్యదర్శి గరిష్ఠ వయోపరిమితిని 45 ఏండ్లుగా నిర్ణయించారు. రెండుసార్లకు మించి ఈ పదవిని చేపట్టరాదని తీర్మానించారు.
ఇక చెన్నైలో ప్రతి 10 వేల ఓటర్లకు, ఇతర మున్సిపాల్టీలలో ప్రతి 5 వేలకు ఒక డివిజన్ యూనిట్ను ఏర్పాటు చేస్తారు. దీనికి గరిష్ఠ వయో పరిమితి 50గా నిర్ణయించారు. ఇక పట్టణ పంచాయతీ కార్యదర్శులకు వయోపరిమితి 60గా పేర్కొన్నారు. అలాగే చెన్నైలో ప్రతి 40 వేల ఓటర్లకు, ఇతర ప్రాంతాల్లో 30 వేల మందితో ఒక ఏరియాగా విభజించి దానికో కార్యదర్శిని ఏర్పాటు చేస్తారు. పట్టణ కార్యదర్శుల గరిష్ఠ వయసు 60కి మించరాదని నిర్ణయించారు.