కోల్కతా: పశ్చిమబెంగాల్లో గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమత నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదిరాయి. రాష్ట్ర సర్కారుతో సంబంధం లేకుండా ఏడు రాష్ట్ర యూనివర్సిటీలకు గవర్నర్ తాత్కాలిక వైస్ చాన్స్లర్లను(వీసీ) నియమించారు.
గవర్నర్ చర్యను విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆయన ఏకపక్షంగా తీసుకొన్న నిర్ణయం యూనివర్సిటీ విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని విమర్శించారు. యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఉల్లంఘించారని పేర్కొన్నారు.