Africa | న్యూఢిల్లీ, డిసెంబర్ 31: భూగోళ చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చివేసేలా తూర్పు ఆఫ్రికాలో భౌగోళిక మార్పులు సంభవిస్తున్నాయి. టెక్టానిక్ ప్లేట్ల (భూమి ఫలకాల) కదలికల వల్ల ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ కొత్తగా మరో సముద్రం ఏర్పడబోతున్నది. రానున్న కోటి సంవత్సరాల్లో ఈ ప్రక్రియ జరిగి భూగోళంపై ఆరవ మహాసముద్రం ఆవిర్భవించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం భూగోళంలో దాదాపు మూడొంతుల భాగం నీటితో కప్పబడి ఉన్న విషయం తెలిసిందే.
ఇది అట్లాంటిక్, పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్, దక్షిణ మహా సముద్రాలుగా విభజితమై ఉన్నది. అయితే ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి మొజాంబిక్ వరకు విస్తరించి ఉన్న గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో భూగోళ అంతర్గత శక్తుల ప్రభావం వల్ల నుబియన్ టెక్టానిక్ ప్లేట్ నుంచి సోమాలి టెక్టానిక్ ప్లేట్ విడిపోతున్నదని, దీంతో ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ హిందూ మహా సముద్రం నీటితో కొత్తగా మరో మహా సముద్రం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇథియోపియా, కెన్యా లాంటి ప్రాంతాల్లో భూమి ఉపరితలంపై పగుళ్లు ఏర్పడటంతో ఆఫ్రికా ఖండం చీలిపోయే ప్రక్రియ కొనసాగుతున్నట్టు స్పష్టమవుతున్నదని చెప్తున్నారు.